హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): యాసంగి వడ్ల కొనుగోళ్ల వ్యవహారంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు కలిసి చావు డప్పు మోగించారు. ఊరూరా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలతో శవయాత్రలు నిర్వహించి, దహనం చేశారు. మోదీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పలుచోట్ల యువకులు గుండు గీయించుకొన్నారు.
ఆయా కార్యక్రమాల్లో మంత్రులు టీ హరీశ్రావు, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్, కొప్పుల ఈశ్వర్, చామకూర మల్లారెడ్డి, సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, అన్ని స్థాయిల రైతుబంధు సమితి బాధ్యులు, టీఆర్ఎస్ నాయకులతోపాటు రైతుసంఘాలు, ప్రజాసంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో రైతులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
మునుపెన్నడూ లేనివిధంగా మహిళలు భారీగా కదలివచ్చారు. రైతుబంధు సమితి బాధ్యులు అన్ని గ్రామాల్లో ఆకుపచ్చ కండువా కప్పుకొని నిరసన చేపట్టారు. రైతులు పార్టీలకు అతీతంగా వరి కల్లాల దగ్గర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా వినూత్న రీతిలో ఆందోళనలు నిర్వహించి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటిచెప్పారు. ఉమ్మడి మెదక్ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. ధర్నా అనంతరం గజ్వేల్ పట్టణంలో ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ సర్కిల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
గ్రామాల్లో నిరసన ర్యాలీలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు సారంగాపూర్లో నిర్వహించిన చావు డప్పు కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పాల్గొన్నారు. రైతులతో కలిసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ నిరసనలతో హోరెత్తింది. అన్ని నియోజకవర్గాల్లో రైతులతో కలిసి టీఆర్ఎస్ నాయకులు దిష్టిబొమ్మలతో శవయాత్రలు నిర్వహించారు. చావు డప్పులు వాయించారు.
కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేశారు. జమ్మికుంట పట్టణంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనాన్ని అడ్డుకొనేందుకు స్థానిక బీజేపీ నాయకులు ప్రయత్నించగా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ వద్ద కరీంనగర్- రాయపట్నం రహదారిపై ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నాయకత్వంలో రైతులు బైఠాయించారు. అనంతరం మెయిన్ రోడ్డు నుంచి మల్లాపూర్ దాకా ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో చేపట్టిన నిరసన దీక్షలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ డప్పు పట్టుకొని దరువేశారు.
అనంతరం మోదీ సర్కారు దిష్టిబొమ్మను దహనం చేశారు. తల్లాడలోని రింగ్ సెంటర్లో రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు నల్లచొక్కాలను ధరించి, తలపై ధాన్యం మూటలను పెట్టుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించారు. మోదీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా రైతు నిరసనలు కొనసాగాయి. ఆందోళనలకు టీఆర్ఎస్ నేతృత్వం వహించగా రైతాంగం స్వచ్ఛందంగా కదలివచ్చి నిరసన తెలిపింది. కొన్ని గ్రామాల్లో రైతులే స్వచ్ఛందంగా చావు డప్పు మోగిస్తూ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను ఊరేగించి దహనం చేశారు. మరికొన్ని చోట్ల కల్లాల వద్ద వరిగడ్డిని దిష్టిబొమ్మలా చేసి, అక్కడే తగులబెట్టి కేంద్రంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
నల్లచొక్కాలు ధరించి, డప్పు కొడుతూ..
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు ధర్నాలు, మోదీ దిష్టిబొమ్మకు శవయాత్రలు నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జడ్పీ గ్రౌండ్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ, శవయాత్ర నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్గౌడ్ నల్లచొక్కా ధరించి, డప్పు కొట్టారు. దిష్టిబొమ్మ పాడె మోశారు. తెలంగాణ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.
వ్యవసాయాన్ని అంబానీ, అదానీలకు కట్టబెట్టే కుట్ర
దేశంలో వ్యవసాయ రంగాన్ని అంబానీ, అదానీలకు అప్పజెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. ఏడేండ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని, అన్నదాతలు బాగుపడిన విధానాన్ని అందరూ హర్షిస్తున్నారు. కానీ, అన్నదాతపై కేంద్రం కత్తి దూస్తున్నది. విద్యుత్తు రంగ సంస్థలను ప్రైవేట్కు అప్పజెప్పాలని చూస్తున్నది. తెలంగాణ సర్కార్ ఉచితంగా ఇస్తున్న వ్యవసాయ విద్యుత్తుకు మీటర్లు పెట్టి, అన్నదాతను ఆగం చేసే కుట్రకు తెరలేపుతున్నది. ఉచిత విద్యుత్తును ఆపేస్తే రైతులు ఏమైపోవాలి? కేంద్రంపై పోరులో తగ్గేదేలేదు.
-మహబూబ్నగర్లో పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
రైతులను వేధిస్తున్న మోదీ సర్కారు
యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో మోదీ ప్రభుత్వం తెలంగాణపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నది. యాసంగి ధాన్యంపై స్పష్టత ఇవ్వకుండా రైతులను వేధిస్తున్నది. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పడం సరికాదు. యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్రం తేల్చే దాకా రైతుల పక్షాన పోరాటం చేస్తాం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నాయకుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దు.
-పెద్దపల్లి జిల్లా ధర్మారంలో మంత్రి కొప్పుల ఈశ్వర్
రైతులను మోసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులను మోసం చేస్తున్నది. యాసంగిలో వరి పంట వేసుకొనేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రం నుంచి రాతపూర్వకంగా లేఖ తీసుకొని రావాలి. కేంద్ర మంత్రులు చెప్పింది వింటూ గంగిరెద్దులా తల ఊపుకొంటూ వచ్చి, బీజేపీ నేతలు రాష్ట్ర రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్నారు. కేంద్రం ధాన్యం కొననంటున్నది కాబట్టి వరి వేసి రైతులు నష్టపోవద్దు. ఇతర పంటల సాగు కోసం రైతు వేదికల వద్ద వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అర్థం చేసుకొని ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలి.
-హనుమకొండ జిల్లా ధర్మసాగర్లో రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి