న్యూఢిల్లీ : గత కొన్ని నెలలుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో నిరసనలకు దిగిన రైతులు వినూత్నంగా హోలీ జరుపుకున్నారు. ఆదివారం రాత్రి హోలీ కా దహన్ కార్యక్రమంలో భాగంగా రైతులు కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను మంటల్లో వేసి కాల్చివేశారు.
చెడుపై మంచి గెలుపునకు నిదర్శనంగా హోలీ జరుపుకుంటున్నట్లుగానే.. ఇది కేంద్రం చట్టాలపై రైతుల ఆగ్రహానికి ప్రతిరూపమంటూ నినాదాలు చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు అన్ని పండుగలను ఇలాగే ఇక్కడే జరుపుకుంటామని రైతులు ముక్తకంఠంతో నినదించారు.
తాము ఉంటున్న ప్రాంతాల్లోనే కుంకుమ, గులాల్ చల్లుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు. రైతుల ఆందోళనలు ఇవాల్టికి సరిగ్గా 123 వ రోజుకు చేరుకున్నాయి. ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఖాజీపూర్లో ప్రదర్శనలు జరుపుతున్న రైతులు.. హోలీ సందర్భంగా జానపద నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ పండుగను ఆస్వాదించారు. కొంతమంది రైతులు పాడుతూ కనిపించగా, కొందరు రంగులు చల్లుకుంటూ వేడుక జరుపుకున్నారు.
వేసవి కాలం సమీపిస్తుండటంతో రైతులు సన్నద్ధమవుతున్నారు. వేడి వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని గుడిసెల్లో ఉండటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గత నెల క్రితం చలిగాలులను ఎదుర్కొన్న వీరు గుడారాలను ఏర్పాటుచేసుకోవడం ప్రారంభించారు.
వేసవిలో డేరా ఎత్తులను పెంచడం ద్వారా ఎండ వేడి నుంచి విముక్తి పొందవచ్చని వారు భావిస్తున్నారు. అలాగే, ఏసీ ట్రాలీలు కూడా పికెటింగ్ సైట్లలో కనిపిస్తున్నాయి. ఈ ఉద్యమం డిసెంబర్ వరకు ఉంటుందని, అందుకే ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు రైతు నాయకుడు రాకేశ్ తికాయత్ తెలిపారు.
చైనాలో బయటపడిన టెర్రకోట ఆర్మీ.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..