హైదరాబాద్ (నమస్తే తెలంగాణ) : ఏడు రకాల వ్యవసాయ ఉత్పత్తుల ట్రేడింగ్పై సెబీ నిషేధం విధించడంపై రైతులు భగ్గమన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, షెత్కారి సంఘటన ఆధ్వర్యంలో రైతులు సెబీ కార్యాలయం ఎదుట నిరవధిక ఆందోళనకు దిగారు. కొంత మంది వ్యాపారుల కోరిక మేరకు సెబీ ఈ నిర్ణయం తీసుకున్నదని యూనియన్ రాజకీయ విభాగమైన స్వతంత్ర భారత పార్టీ అధ్యక్షుడు అనిల్ గన్వత్ ఆరోపించారు. సెబీ చర్య రైతు వ్యతిరేకమైనదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ ట్రేడ్స్ను నిషేధించడం ద్వారా రైతులకు ఉన్న ఏకైక ధర సూచికను తీసివేసినట్లయ్యిందని మండిపడ్డారు.
సెబీ నిషేధ నేపథ్యం ఏమిటి?
మూలధన మార్కెట్ల నియంత్రణ సంస్థ గోధుమలు, వరి (బాస్మతియేతర), పెసర, శనగ, సోయాబీన్, దాని ఉత్పన్నాలు, ఆవాలు, వాటి ఉత్పన్నాలు, పామాయిల్, దాని ఉత్పనాలు.. ఇలా ఏడు ఉత్పత్తుల విషయంలో ఫ్యూచర్ ట్రేడింగ్ను 2021 డిసెంబర్ 20న నిలిపేసింది. ఈ ఉత్పత్తుల్లో కొత్త కాంట్రాక్ట్ను అనుమతించబోమని సెబీ పేర్కొంది. ఈ ఏడింటిలో శనగ, ఆవాలు ఇదివరకే నిషేధించబడ్డాయి. ఈ నిషేధాన్ని 2022 డిసెంబర్లో మరో సంవత్సరం పాటు పొడిగించారు. నిషేధం ప్రారంభమైనప్పటి నుంచి ధరల విషయంలో సమస్య ఉత్పన్నమైనదని యూనియన్ నేత అనిల్ గన్వత్ సహా పలువురు పేర్కొన్నారు. సాల్వెంట్ అండ్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్తో సహా పలు వాణిజ్య సంస్థలు, ఎడిబుల్ ఆయిల్ తయారీదారులు, దిగుమతిదారుల సంఘం కూడా నిషేధాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టాయి. ఎక్సేంజ్ అందించే ఫ్యూచర్ ట్రెండ్స్ రైతులకు ముఖ్యమైన సూచిక. మార్కెట్లు, లేదా మండీలు ఈ ట్రెండునే అనుసరిస్తాయి. దాని ఆధారంగానే రైతులు ఎగుమతి ప్రణాళికలు వేసుకుంటారు.