హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీకి టీఆర్ఎస్ సిద్ధమైంది. మోదీ సర్కారు అనుసరిస్తున్న నిర్లక్ష్య, కక్షసాధింపు ధోరణిని పార్లమెంటూ సాక్షిగా ఎండగడుతామని టీఆర్ఎస్ ఎంపీలు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. రైతుల ప్రయోజనాలే పరమావధిగా ఐదురోజులపాటు ఉభయసభల్లో గట్టిగా గళం వినిపించామని, సోమవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యే పార్లమెంటూ శీతాకాల సమావేశాల్లో కూడా బీజేపీ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని నిరసిస్తామని చెప్పారు. సోమవారం ఉదయం 10 గంటలకు పార్టీ పార్లమెంటరీ నేత కే కేశవరావు, పార్టీ లోక్సభా పక్ష నామా నాగేశ్వర్రావు సమావేశమై.. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి కార్యాచరణకు దిగనున్నట్టు తెలిసింది.
ఐదురోజులపాటు అనుసరించిన వాయిదా తీర్మానం కోసం ఉభయసభల్లో పట్టుబట్టడం, కలిసివచ్చే పార్టీ సభ్యులను కలిసి మద్దతు కోరటం వంటి అంశాలను కొనసాగిస్తూనే కేంద్రంపై నిరంతర ఒత్తిడి తేవాలని పార్టీ భావిస్తున్నది. రాష్ట్ర ప్రయోజనాలు, రైతు ప్రయోజనాల విషయంలో రాజీలేని పోరాటమే ధ్యేయంగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు వినూత్నంగా ఉండే అవకాశాలున్నాయని విశ్వసనీయవర్గాల సమాచారం.