ప్రభుత్వ ఏఎమ్మార్పీ వరద కాల్వ అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడంతో దీని పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు కావస్తున్నా మరమ్మతులకు నిధులు విడుదల చేయకపోవడంతో వరద కాల్వ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది.
మిర్యాలగూడ, జూన్ 15: నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టులో ఎత్తిపోతల పథకం ద్వారా చివరి భూములకు సాగునీరు అందించే లక్ష్యంతో ఏఎమ్మార్పీ వరద కాల్వను నాటి ప్రభుత్వం నిర్మించింది. ఈ కాల్వను 83 కిలోమీటర్ల పొడవులో నిర్మించారు. 81 ప్యాకేజీలో 27 డిస్ట్రిబ్యూటర్లు, 110 ప్యాకేజీలో 15 డిస్ట్రిబ్యూటర్లతో పాటు తూములను ఏర్పాటు చేశారు. ఈ కాల్వ ద్వారా పెద్దవూర, అనుముల, నిడమనూరు, త్రిపురారం, వేములపల్లి, తిప్పర్తి మండలాల పరిధిలో 20 చెరువులను నింపే విధంగా డిజైన్ చేశారు. నేరుగా కాల్వల ద్వారా 80 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 575 అడుగులకుపైగా నీటి మట్టం రాగానే నేరుగా వరద కాల్వకు నీరు మళ్లించే విధంగా డిజైన్ చేశారు. ప్రాజెక్టులో 575 అడుగులలోపు నీరు ఉంటే పంప్హౌస్ ద్వారా నీరు ఎత్తిపోసి వరదకాల్వకు నీరు విడుదల చేస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేసి కాల్వలకు మరమ్మతులు చేయడంతో 80 చెరువుల నుంచి 80 వేల ఎకరాల విస్తీర్ణానికి సాగునీరు అందడంతో రైతులు ప్రయోజనం పొందారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరమ్మతులకు నిధులు మంజూరు చేయకపోవడంతో గత ఏడాది వరద కాల్వకు పలుచోట్ల గండ్లు పడి పొలాలు దెబ్బతిన్నాయి.
కంపచెట్లతో నిండిపోయిన వరద కాల్వ
వరద కాల్వకు రెండు వైపులా కంపచెట్లు పెరిగిపోయి రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. కాల్వలో కంపచెట్లు కారణంతో వేములపల్లి, తిప్పర్తి మండలాల్లోని భూములకు, చెరువులకు నీరందక రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వరదకాల్వను నమ్ముకొని గత యాసంగిలో వరి పొలాలకు సాగునీరందక పంటలు ఎండిపోవడంతో మేకలు, గొర్రెలు, పశువులతో మేపేశారు. ఏఎమ్మార్పీ వరద కాల్వ ముందు భాగంలో పలు చోట్ల కాల్వ కట్టలు బలహీనంగా మారి గండ్లు పడ్డాయి. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో కాల్వలకు ముందు భాగంలో ఏర్పడిన గండ్లను పూడ్చకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తోపుచర్ల, కుక్కడం, పుచ్చకాయలగూడెం, గండ్రవానిగూడెం, మొల్కపట్నం, మంగాపురం, సల్కునూరు గ్రామాల పరిధిలో పలుచోట్ల పంటలు ఎండిపోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు.