న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గతేడాది తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం భారత్ బంద్ జరుగనున్నది. దేశ వ్యాప్తంగా శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు 12 గంటలు ఈ బంద్ కొనసాగుతుందని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు చెప్పారు.
దేశవ్యాప్తంగా రైలు, రోడ్డు రవాణా సర్వీసులను బ్లాక్ చేయాలని రైతు నేతలు నిర్ణయించారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో రైలు, రోడ్డు రవాణా సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ సైతం మూసి వేయాలని కోరారు. బంద్ను శాంతియుతంగా నిర్వహించి తమకు మద్దతుగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అంబులెన్స్, ఇతర ఎమర్జెన్సీ సేవలు మినహా అన్ని రకాల సేవలను అడ్డుకుంటామని రైతు సంఘాల నేతలు తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే, సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) బంద్ పిలుపుకు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), టీడీపీ, వైఎస్ఆర్ సీపీ, సీపీఎం, సీపీఐ తదితర రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి.
విపక్షాల మద్దతుతో భారత్ బంద్ వల్ల పలు రాష్ట్రాల్లో సాధారణ జనజీవనంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఎస్కేఎం ఇచ్చిన బంద్ పిలుపునకు పలు రైతు సంఘాలు, కార్మిక, విద్యార్థి సంఘాలు, బార్ అసోసియేషన్లు, రాజకీయ పార్టీలు తమ బంద్కు మద్దతు ప్రకటించాయని రైతు నేత దర్శన్ పాల్ తెలిపారు. అయితే, ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మినహాయింపులు ఉంటాయి.
కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాల రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 4 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో వేల మంది రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో కొందరు రైతులు కూడా సింఘు, ఘాజీపూర్, టిక్రీ సరిహద్దుల్లో ఆందోళన సాగిస్తున్నారు.
ఈ నెలలో జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు..!
పీఎస్యూల ప్రైవేటీకరణతోనే వృద్ధి రేటు పరుగులు : రాకేష్ జంఝన్వాలా
ఐసీఐసీఐ సంచలనం
వచ్చే ఏడాది వరకూ ఇంతే.. కొవిడ్-19 ఎఫెక్ట్పై మెజారిటీ సీఈవోలు
చందా కొచర్కు రిలీఫ్.. ఆమె భర్త దీపక్కు బెయిల్