న్యూఢిల్లీ, నవంబర్ 21: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద కొత్త వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో అధికారికంగా రద్దు చేసేంత వరకూ నిరసనోద్యమాన్ని విరమించబోమని రైతు నేతలు తేల్చి చెప్పారు. ఈ మేరకు ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు ప్రాంతంలో నిరసన తెలుపుతున్న రైతులతో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతృత్వంలో ఆదివారం జరిగిన సమావేశంలో తీర్మానించారు. చట్టబద్ధమైన కనీస మద్దతు ధరపై (ఎంఎస్పీ) హామీ, శాంతియుత నిరసనలు చేపడుతున్న రైతులపై నమోదు చేసిన కేసుల ఎత్తివేత వంటి ఆరు డిమాండ్లతో ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ‘సమావేశంలో సాగు చట్టాల రద్దుపై ప్రధానంగా చర్చించాం. పార్లమెంటులో అధికారికంగా చట్టాలను రద్దు చేసేంతవరకూ ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతాయ’ని రైతు నాయకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ తెలిపారు.
గతంలో నిర్ణయించిన విధంగానే ఎంఎస్పీ విషయమై సోమవారం యూపీ రాజధాని లక్నోలో ‘కిసాన్ మహా పంచాయత్’ కార్యక్రమం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. నవంబర్ 26న ఢిల్లీ సరిహద్దుల్లో సభలు, సమావేశాలు, అమరులైన రైతులకు నివాళి కార్యక్రమాలు ఉంటాయన్నారు. గతంలో నిర్ణయించినట్టే, 500 ట్రాక్టర్లతో ఈ నెల 29న పార్లమెంట్ మార్చ్ కొనసాగుతుందని తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణ కోసం నవంబర్ 27న ఉదయం 11 గంటలకు ఎస్కేఎం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. మరణించిన అన్నదాతలకు పరిహారంపై కూడా సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. రైతుల ఉద్యమం ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రధాని మోదీ శుక్రవారం ప్రకటించడం తెలిసిందే.
మాతో చర్చలకు రావాల్సిందే
పెండింగ్లో ఉన్న ఆరు డిమాండ్లను నెరవేర్చాలంటూ ఎస్కేఎం నేతలు ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. ఎంఎస్పీపై చట్టానికి హమీ, లఖింపూర్ ఘటనకు కారణమైన కేంద్రమంత్రి అజయ్మిశ్రాను పదవి నుంచి తొలగించడం, అరెస్ట్ చేయడం, నిరసనలు చేస్తున్న రైతులపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవడం, ఉద్యమంలో అమరులైన అన్నదాతలకు స్మారకచిహ్నం నిర్మాణం, ఢిల్లీ కాలుష్యానికి కారణం రైతులేనని ఆరోపిస్తూ వారిపై విధించిన కఠిన నిబంధనలు, కేసులను వెనక్కి తీసుకోవడం, విద్యుత్తు సవరణ బిల్లు 2020/2021 ఉపసంహరణ వంటి ఆరు డిమాండ్లను మోదీ ముందుంచారు. రైతులు ఇండ్లకు వెళ్లిపోవాలంటూ ప్రధాని విజ్ఞప్తి చేశారని గుర్తుచేసిన రైతు నేతలు.. పై డిమాండ్లపై వెంటనే కేంద్రప్రభుత్వం తమతో చర్చించాలని డిమాండ్ చేశారు.
ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించిన తర్వాతనే నిరసనలు విరమించి ఇండ్లకు తిరిగి వెళ్లిపోతామని ఆ లేఖలో పేర్కొన్నారు. అప్పటి వరకూ ఉద్యమం కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. రైతు నేతలతో 11 దఫాల చర్చల తర్వాత కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. మరోవైపు, ఈ నెల 24న జరుగనున్న కేంద్ర క్యాబినెట్ సమావేశంలో సాగు చట్టాల రద్దుపై తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తున్నది.
అవసరమైతే మళ్లీ సాగు చట్టాలు!
భవిష్యత్తులో అవసరమైతే సాగు చట్టాలను మళ్లీ కేంద్ర ప్రభుత్వం తీసుకురావచ్చని రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా తెలిపారు. బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. వీరి వ్యాఖ్యలపై సమాజ్వాదీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే నల్ల చట్టాలుగా పిలుస్తున్న సాగు చట్టాలను ప్రభుత్వం తీసుకురావొచ్చని పేర్కొంది. మరోవైపు, సాగుచట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రభుత్వం చేసిన ప్రకటనపై అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తెలిపారు. రైతు ఉద్యమంలో మరణించిన రైతుల కుటుంబాలకు పీఎం కేర్స్ ఫండ్ నుంచి పరిహారం అందించాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు క్షమాపణలు చెబితే సరిపోదని, వారి కుటుంబాలను ఆదుకోవడం ముఖ్యమని కేంద్రానికి హితవు పలికారు.