ముంబై, సెప్టెంబర్ 28: రూపాయి అడ్డూఆపూ లేకుండా పతనమవుతున్నది. వరుసగా కొత్త కనిష్ఠాల్ని తాకుతున్న దేశీ కరెన్సీ మరో 40 పైసలు క్షీణించింది. బుధవారం నాడిక్కడ ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్ ఇంట్రాడే ట్రేడింగ్లో విలువ 82 స్థాయి దిగువకు పడిపోయింది. చివరకు చరిత్రాత్మక కనిష్ఠస్థాయి 81.93 వద్ద ముగిసింది. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు షేర్లు, బాండ్లను విక్రయించి మార్కెట్ నుంచి నిధుల్ని తీసుకోవడంతో అమెరికా డాలర్ అత్యంత బలోపేతం అవుతున్నది. ఫలితంగా డాలర్ మారకంలో రూపాయి విలువ పతనమవుతున్నది. రిస్క్ సాధనాలపట్ల ఇన్వెస్టర్లు విముఖత చూపిస్తున్నందున, రూపాయి కొత్త కనిష్ఠాలకు పతనమయ్యిందని రిలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ సుగంధ సచ్దేవా చెప్పారు.
డాలర్ ఇండెక్స్ సరికొత్త రికార్డు 115 స్థాయిని సమీపానికి పెరగడం, ఈక్విటీ మార్కెట్లు పతనంకావడంతో దేశీ కరెన్సీ క్షీణించిందన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ డాలర్ 19.50 శాతం ర్యాలీ జరిపింది. పశ్చిమ దేశాలు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తుండ టం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందన్న ఆందోళనలతో ఇతర ఆసియా కరెన్సీలతో పాటు రూపాయి కూడా తగ్గుతున్నదని సచ్దేవా వివరించారు.
విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడంతో ఫారెక్స్ మార్కెట్లో రిజర్వ్బ్యాం క్ జోక్యం అంతంతమాత్రంగానే ఉన్నదని, దీనికి తోడు ఫారెక్స్ ట్రేడర్లు రూపాయిల్ని భా రీగా విక్రయించి డాలర్లుగా మార్చుకుంటున్నారని, ఈ పరిణామాలతో దేశీ కరెన్సీ పతనం వేగవంతమైనట్లు తెలిపారు. మంగళ, బుధవారాల్లో విదేశీ ఇన్వెస్టర్లు రూ. 5,500 కోట్ల వి లువైన షేర్లను నికరంగా విక్రయించినట్టు స్టాక్ ఎక్సేంజీల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇప్పటికే భారీగా తగ్గిన విదేశీ మారక నిల్వలు మరింతగా క్షీణిస్తాయని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. అమెరికా డాలర్ భారీగా పెరుగుతున్నందున, రూపాయి రక్షణకు కొంతమేర విదేశీ కరెన్సీని రిజర్వ్బ్యాంక్ ఖర్చుచేస్తుందంటూ రాయిటర్స్ నిర్వహించిన ఒక పోల్లో ఆర్థిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంగా దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు 100 బిలియన్ డాలర్ల మేర తరిగిపోయి 642 బిలియన్ల నుంచి 545 బిలియన్లకు పడిపోయాయి. ఈ సంవత్సాంతానికల్లా ఇవి 500 బిలియన్ డాలర్ల వరకూ పడిపోతాయని పోల్లో పాల్గొన్న ఆర్థికవేత్తలు అంచనా వేశారు.
2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత విదేశీ మారకం ఇంతగా క్షీణించడం ఇదే ప్రధమం. ఆ సందర్భంలో ఇవి 20 శాతం తగ్గాయి. 2013లో అమెరికా ఫెడ్ హఠాత్తుగా ప్రభుత్వ బాండ్ల కొనుగోళ్లను తగ్గించినప్పటికంటే వేగంగా ప్రస్తుతం విదేశీ కరెన్సీని ఖర్చు చేస్తున్నది. దశాబ్దం తర్వాత భారత్ మళ్లీ ఇటువంటి పరిస్థితుల్లో అల్లాడుతున్నదని ఆర్థిక వేత్తలు తెలిపారు. ఆర్బీఐ డాలర్లు విక్రయిస్తున్నప్పటికీ, రూపాయి ఈ ఏడాది 10 శాతం క్షీణించి 82 స్థాయికి పడిపోయింది.
న్యూఢిల్లీ: పశ్చిమ దేశాలు ద్రవ్య విధానాన్ని అంచనాలకు మించి కఠినతరం చేస్తున్నందున ఆసియా ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నస్థితికి చేరుతుందని ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) హెచ్చరించింది. బుధవారం నాడిక్కడ ఏడీబీ ప్రెసిడెంట్ మసాట్సుగు అసాకవా మీడియాతో మాట్లాడుతూ స్థానిక కరెన్సీల మారకం రేటు మరింత తరిగిపోతుందని, ఈ క్లిష్ట సమయంలో వర్థమాన సభ్య దేశాలకు మద్దతునివ్వడానికి ఏడీబీ కసరత్తు చేస్తున్నదన్నారు.
ధనిక దేశాలు..ప్రత్యేకించి ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తున్న నేపథ్యంలో రిస్క్ సంబంధిత విదేశీ నిధులు వేగంగా తరలిపోతాయన్నారు. ఆసియా దేశాల్లో సామాజిక, ఆర్థిక పరిస్థితులు సవాలుగా మారాయని, కొవిడ్ నుంచి ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటున్న తరుణంలో మళ్లీ భవిష్యత్ అనిశ్చితంగా మారిందని ఏడీబీ ప్రెసిడెంట్ వాపోయారు. 2022 సంవత్సరానికి ఆసియా పసిఫిక్ ఆర్థికాభివృద్ధి రేటు అంచనాల్ని ఏడీబీ 5.2 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గించింది.