‘కమర్షియల్ లెక్కల గురించి ఆలోచించకుండా చేసిన ధైర్యవంతమైన ప్రయత్నమిది. సినిమాలోని కథ, పాత్రలతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడుతున్నారు’ అని అన్నారు శ్రియ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గమనం’. సుజనారావు దర్శకత్వం వహించారు. జ్ఞానశేఖర్ వీఎస్, రమేష్, వెంకీ నిర్మించారు. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకులముందుకొచ్చింది. శనివారం హైదరాబాద్లో చిత్రబృందం థ్యాంక్స్మీట్ను నిర్వహించింది. ఈ సందర్భంగా శ్రియ మాట్లాడుతూ ‘అందమైన కథతో తెరకెక్కిన చిత్రమిది. తన కెమెరా ప్రతిభతో ప్రతి పాత్రకు జ్ఞానశేఖర్ ప్రాణం పోశారు. కన్నీళ్లు పెట్టుకునే సన్నివేశాల్ని హృద్యంగా చూపించారు. సాయిమాధవ్ బుర్రా సంభాషణలకు చక్కటి స్పందన లభిస్తున్నది’ అని చెప్పింది. శివ కందుకూరి మాట్లాడుతూ ‘చక్కటి ఫీల్గుడ్ సినిమా చేయాలనే మా సంకల్పం నెరవేరింది. అర్థవంతమైన సినిమా చూశామనే సంతృప్తితో థియేటర్స్ నుంచి ప్రేక్షకులు బయటకొస్తున్నారు’ అని తెలిపారు. సుజనారావు మాట్లాడుతూ ‘కమల పాత్రలో శ్రియ జీవించారు. శివ కందుకూరి, ప్రియాంక పాత్రలతో యువతరం కనెక్ట్అవుతున్నారు. భిన్నమైన సినిమాగా అందరి ప్రశంసలు అందుకోవడం ఆనందంగా ఉంది’ అని చెప్పారు.