ఆదివాసీలే లక్ష్యంగా దొంగనోట్ల చలామణి
నకిలీ కరెన్సీకి వినియోగించే యంత్రాలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఏఎస్పీ రోహిత్రాజ్
భద్రాచలం/ చర్ల, జూన్ 7 : ఆదివాసీలే లక్ష్యంగా దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను భద్రాచలం ఏఎస్పీ రోహత్రాజ్ మంగళవారం చర్ల పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరించారు. చర్ల మండలంలోని తేగడ గ్రామానికి చెందిన చినిగిరి నరేశ్, కలివేరు గ్రామానికి చెందిన బోస్ ప్రేమ్కుమార్, కొత్తపల్లి గ్రామానికి చెందిన గుమ్మల సర్వేశ్వరరావు, ఒక బాలుడు, మండల కేంద్రం చర్లకు చెందిన సయ్యద్ ఇక్బాల్, గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలేనికి చెందిన మల్లెల వినోద్కుమార్, పెద్దారం గ్రామానికి చెందిన కొత్తపల్లి జీవరత్నం, పబ్బటి జయలక్ష్మి కలిసి ముఠాగా ఏర్పడి ఏజెన్సీలో దొంగనోట్లు చలామణి చేస్తున్నట్లు తెలిపారు.
వీరివద్ద నుంచి దొంగనోట్లు స్వాధీనం చేసుకొని ఏడుగురిని అరెస్టు చేశామని ఏఎస్పీ పేర్కొన్నారు. నకిలీ రూ.2 వేల నోట్లు 90, రూ.500 నోట్లు 551, రూ.200 నోట్లు 300, నకిలీ కరెన్సీ తయారీకి ఉపయోగించే కంప్యూటర్, ఐరన్ బాక్స్, ఆకుపచ్చని సన్నటి దారాలు, పెన్సిల్ చెక్కడానికి ఉపయోగించే చాక్మరలు 10, కారును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో చర్ల సీఐ అశోక్ పాల్గొన్నారు.