సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): డిస్కౌంట్తో కూడిన కుటుంబ ఆరోగ్య బీమా ఇస్తామంటూ.. ఫోన్లు చేస్తూ..అమాయకులను మోసం చేస్తున్న నకిలీ కాల్సెంటర్ గుట్టును నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్తులను అరెస్టు చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్రావు కథనం ప్రకారం.. చెన్నైకి చెందిన గోపికృష్ణ వెంకటకృష్ణ ఆర్థిక నేరాలు చేయడంలో ఆరితేరాడు. అక్కడి పోలీసులు అతడిపై పీడీయాక్ట్ కూడా ప్రయోగించారు. పాత నేరస్తుడు అదే రాష్ర్టానికి చెందిన నటరాజ్ను సహాయకుడిగా నియమించుకున్నాడు. సికింద్రాబాద్లోని తిరుమలగిరి పోలీస్స్టేషన్ పరిధిలో యూనైటెడ్ ఇండియా హెల్త్ ఆర్గనైజేషన్ పేరుతో నకిలీ కాల్ సెంటర్ను ప్రారంభించాడు. మహిళా టెలీ కాలర్స్ను నియమించుకున్నాడు. ప్రైవేట్ ఏజెన్సీల నుంచి ఫోన్ నంబర్లకు సంబంధించి బల్క్ డేటాను కొని, భారీగా సిమ్కార్డులు కొనుగోలు చేశాడు. తక్కువ ప్రీమియంతో హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నామంటూ.. కాల్సెంటర్ నుంచి ఫోన్లు చేయిస్తూ.. అమాయకులను బుట్టలో వేస్తున్నాడు. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలంటూ..డిపాజిట్లు కూడా సేకరించాడు. నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు బృందం ఆ సెంటర్పై దాడి చేసి.. గోపికృష్ణ, నటరాజ్ను అరెస్టు చేశారు. హెల్త్ ఇన్సూరెన్స్లో 38, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్లో 14 మంది రూ. 5.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు దర్యాప్తులో బయటపడింది. నకిలీ సర్టిఫికెట్లు, 20 సిమ్కార్డులతో పాటు రూ. 18 వేల నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.