మన్సూరాబాద్, జనవరి 29: ఇంటికి నరదృష్టి ఉందంటూ మహిళను మాయమాటలతో మభ్యపెట్టి పుస్తెలతాడును అపహరించిన నకిలీ బాబా (కోయదొర) కేసును ఎల్బీనగర్ పోలీసులు ఛేదించారు. ఆరు గంటల్లోనే నకిలీ కోయదొరను పట్టుకుని కటకటాల వెనక్కి పంపించారు. నిందితుడి నుంచి రూ.40 వేల విలువైన ఆరు గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్లోని డీసీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ బి.సాయిశ్రీ వివరాలను వెల్లడించారు. నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన విబుడి రాములు (64) కోయదొరగా చలామణి అవుతూ ప్రస్తుతం మీర్పేట, భూపేశ్గుప్తానగర్, గ్రీన్ల్యాండ్కాలనీలో నివాసముంటున్నాడు. కోయదొర వేషంలో కాలనీల్లో సంచరిస్తూ అమాయక ప్రజలను తన మాటలతో మభ్య పెడుతుంటాడు. ఇంటికి నరదోషం ఉన్నదని.. తనతో పూజలు చేయిస్తే నరదోషం పోతుందని ప్రజలను నమ్మించి బంగారు ఆభరణాలను దోచుకుంటున్నాడు.
నల్గొండ జిల్లా డిండి పోలీస్స్టేషన్, సరూర్నగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో నరదృష్టి పేరుతో ప్రజలను మోసగించి బంగారు నగలు దోచుకెళ్లిన కేసుల్లో రాములు జైలుకు వెళ్లాడు. అయినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తిరిగి తన పాత పంథాలోనే ప్రజలను మోసగించడం ప్రారంభించాడు. హస్తినాపురం సెంట్రల్, ఇంద్రప్రస్తాకాలనీకి చెందిన చీకట్ల వీరలక్ష్మి ఇంటికి శనివారం 12 గంటల సమయంలో భిక్షాటన కోసం వెళ్లాడు. భిక్షాటన అనంతరం వీరలక్ష్మిని మాటల్లోకి దించాడు. ఇంటికి నరదృష్టి ఉంది.. తాను పూజలతో బాగు చేస్తానని చెప్పాడు. బియ్యం, ప్లేటు తీసుకురావాలని సూచించాడు. పుస్తెలతాడు అందులో పెట్టి కుంకుమ, పసుపు తేవాలని చెప్పాడు. కుంకుమ, పసుపు కోసం ఆమె ఇంట్లోకి వెళ్లగానే.. బంగారు పుస్తెలతాడుతో ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన ఎల్బీనగర్ పోలీసులు నిందితుడిని నందనవనంలో అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. దొంగతనం విషయం బయటపడింది. నేరం జరిగిన ఆరు గంటల్లోనే నిందితుడిని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమావేశంలో ఎస్వోటీ ఎల్బీనగర్ జోన్ డీసీపీ మురళీధర్, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి, ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ బి.అంజిరెడ్డి, డీఐ బి.ఉపేందర్ రావు, డీఎస్ఐ ఆర్.నరేందర్ పాల్గొన్నారు.