ధర్మపురి, జనవరి 31: ఫేస్బుక్ మిత్రులు ఓ నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టించి పెద్ద దిక్కుగా నిలిచారు. జగిత్యాల జిల్లా బీర్పూర్కు చెందిన కడ గంగారాం అనారోగ్య సమస్యలతో ఐదేండ్ల క్రితం ఆత్మహత్య చేసుకొన్నాడు. దీంతో కుటుంబ భారం భార్య అంజలిపై పడింది. కూలీ చేసుకొంటూ కూతుళ్లతో గుడిసెలో నివసిస్తున్న ది. పెద్ద కూతురు డిగ్రీ ఫస్టియర్, చిన్న కూతురు 8వ తరగతి చదువుతున్నది. గుడిసెలో ఉంటూ వర్షానికి, చలికి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకొన్న ధర్మపురికి చెందిన సామాజిక కార్యకర్త రేణికుంట రమేశ్ స్పందించారు. వీరి దీన స్థితిని వివరిస్తూ సాయం చేయాల్సిందిగా ఫేస్బుక్లో పోస్టు చేశారు. స్పందించిన ఎన్నారైలు, దాతలు అంజలి బ్యాంకు ఖాతాలో రూ.2.24 లక్షలు జమచేశారు. అంజలి కోరిక మేరకు ఆ డబ్బుతో బీర్పూర్లో ఇంటిని నిర్మిస్తున్నామని, మరో 10 రోజుల్లో పూర్తవుతుందని రమేశ్ తెలిపారు.