1969 తెలంగాణ ఉద్యమంలో 369 మంది అమరులైనారు. ఆ త్యాగాల పునాదులపై ‘తెలంగాణ ప్రజా సమితి’ ఆవిర్భవించి పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాలకు 10 స్థానాలు గెలిచి తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికి చాటింది. కానీ అనతికాలంలోనే ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసి వారంతా అధికార కాంగ్రెస్లో చేరటంతో తెలంగాణ నినాదం మరుగునపడే పరిస్థితి వచ్చింది.
మలిదశ తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమం 1996లో ప్రారంభమైంది. 2001లో తెలంగాణ నినాదంతో కేసీఆర్ నేతృత్వంలో జలదృశ్యం కేంద్రంగా పురుడుపోసుకున్న టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని పల్లెపల్లెకు విస్తరించేలా చేసింది. తెలంగాణ కవులు, కళాకారులు సైతం కేసీఆర్కు వెన్నుదన్నుగా నిలిచారు. ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ సాంస్కృతిక రంగం బలోపేతమైంది. నాటినుంచి 2014 వరకు రాజకీయ చదరంగంలో వెనకడుగు వేయలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా పోరాటం చేసిన టీఆర్ఎస్.. కాంగ్రెస్, బీజేపీ పార్టీల మెడలు వంచేలా చేసింది. పోరాట ఉధృతితో తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని ఏర్పాటు చేయకతప్పలేదు. ఈ సుదీర్ఘ పోరాటంలో టీఆర్ఎస్ చేసిన పోరాటం ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది.
ప్రపంచంలోనే మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజా సమస్యల పరిష్కారానికి రాజకీయ అధికారమే అంతిమ లక్ష్యం. నేడు దేశంలో 8 జాతీయ పార్టీలు ఉండగా, రాష్ట్రంలో 67 పేరొందిన రాజకీయ పార్టీలున్నాయి. అలాగే నమోదై 2,796 గుర్తింపు పొందని పార్టీలున్నాయి. జాతీయపార్టీలను పక్కనపెడితే, ప్రాంతీయ పార్టీల్లో టీఆర్ఎస్ది ప్రత్యేక స్థానం. పార్టీలు కేవలం అధికారం కోసమే ఓటర్లను మచ్చిక చేసుకుంటాయి. ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తుంటాయి. కానీ టీఆర్ఎస్ అందుకు భిన్నం. ఏటా ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ పాలకవర్గాన్ని ఎన్నుకొంటూ తమ పార్టీ బలాన్ని ఓ బహిరంగ సభ ద్వారా నిరూపించుకునే సంప్రదాయం కేవలం ఒక్క టీఆర్ఎస్కే దక్కుతుంది. అలాగే బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సంస్థాగత కమిటీలు ఉండటమే కాకుండా అందులో అన్ని కులవర్గాలకు ప్రాతినిధ్యం ఉంది. మహిళలకు సైతం తగినస్థాయిలో ప్రాతినిధ్యం ఉన్న ఏకైక పార్టీ టీఆర్ఎస్సే.
కేంద్ర ఎన్నికల సంఘం 2019 గణాంకాల ప్రకారం తెలంగాణలో 2.8 కోట్ల మంది ఓటర్లున్నారు. వారిలో టీఆర్ఎస్లో క్రియాశీల సభ్యత్వం పొందినవారు 60 లక్షల మంది. అంటే మొత్తం ఓటర్లలో 21.3 శాతం అన్న మాట. ఇక పార్టీ సానుభూతిపరులు లక్షల్లో ఉంటారు. ఇంతపెద్ద ఎత్తున ప్రజల మద్దతుతో పార్టీ సభ్యత్వం కలిగి ఉన్న ఏకైక పార్టీ టీఆర్ఎస్. ప్రాంతీయపార్టీగా ప్రజల అండదండలతో రెండు పర్యాయాలు అధికారపగ్గాలు చేపట్టగలిగిందంటే అది ప్రజామోదానికి నిదర్శనం.
నీళ్ళు, నిధులు, నియామకాల్లో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టును అనతికాలంలోనే పూర్తిచేసి ఐక్యరాజ్యసమితి మన్ననలు సైతం పొందింది. దానిద్వారా సుమారు 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలకు సాగు నీరందుతున్నది. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్న కారణంగా 38.5 లక్షల మంది ప్రభుత్వం నుంచి ఆసరా పింఛన్లు పొందుతున్నారు. అలాగే రైతుబంధు ద్వారా 59 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు.
ప్రజా సంక్షేమంలో దేశంలోనే అగ్రస్థానంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ను అన్నివర్గాలు ఆదరిస్తున్నాయి, అండగా నిలుస్తున్నాయి. ప్రవాస భారతీయులు సైతం తెలంగాణ నినాదాన్ని అన్నిదేశాల్లో వినిపిస్తుండటం గమనార్హం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా యాభై దేశాల్లో టీఆర్ఎస్-ఎన్నారై విభాగాలున్నాయి. అన్ని దేశాల ప్రతినిధులు ఒక తాటిపైకి వచ్చి తెలంగాణ రాష్ట్ర పాలనకు జేజేలు పలుకుతున్నారు. ఇది టీఆర్ఎస్ పాలనకు ఒక కొలమానం అని చెప్పవచ్చు. అంతేకాదు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విశ్వమంతటా చాటుతున్న తీరు తెలంగాణకు గర్వకారణం.
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కేవలం ఓటుబ్యాంకు రాజకీయాల కోసమే వాడుకోవటం లేదు. వారిని పార్టీ కుటుంబసభ్యులుగా వారి కష్టసుఖాల్లో భాగస్వామి అవుతున్నది. పార్టీ శ్రేణులకు, వారి కుటుంబాలకు తోడుగా ఉంటున్నది. క్రియాశీల సభ్యత్వం ఉన్న కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పిస్తున్నది. వారికోసం 2021-22 సంవత్సరానికి రూ.18 కోట్ల బీమా కిస్తీని బీమా కంపెనీలకు చెల్లించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,815 మంది పార్టీ కార్యకర్తలు మరణిస్తే, ప్రతి కుటుంబానికి రెండు లక్షల చొప్పున ఆర్థికసాయాన్ని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ అందజేశారు. ఉద్యమకాలం నుంచి పార్టీకి సేవలందిస్తున్న వారికోసం టీఆర్ఎస్ ఎలా అండగా ఉంటూ వస్తుందో ఇది నిదర్శనం. ముఖ్యంగా విద్యార్థి లోకాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నది. వారిని కేవలం ఉద్యమకారులుగానే చూడకుండా చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించారు. అలాగే అనేక నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పించారు. మహిళలకు పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పదవుల్లో సమన్యాయం పాటిస్తూనే, 27 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ వారికి అగ్రతాంబూలం వేస్తున్నది. ఇలాంటి పార్టీ సుదీర్ఘంగా 20 ఏండ్ల పాటు ప్రజా క్షేత్రంలో ఉంటూ ప్రజల మన్ననలు పొందుతుందంటే పార్టీ విధాన నిర్ణయాలు, పార్టీ నేత మానవీయ కోణమే కారణం. తెలంగాణ బహుముఖాభివృద్ధి కోసం ప్రజల దీవెనలతో మరో నాలుగు దశాబ్దాల పాటు అధికారంలో కొనసాగాలని ఆశిద్దాం.
(వ్యాసకర్త: రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్)
డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి
95530 86666