ఏం తినేటట్టు లేదు.. ఏం కొనేటట్టు లేదు.. అవును మరి. తినే కూర, తొడిగే బట్ట, తొక్కే చెప్పు, తోలే మోటరు ఇలా అన్నింటి ధరలు భగ్గుమంటున్నాయిప్పుడు. ఆదాయమున్నా అక్కరకొచ్చేవి కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నామన్నది దేశంలోని ఎక్కువమంది మాట. నిజమే గిట్లుంటె ఇంకేం కొంటం.
న్యూఢిల్లీ, మే 11: ‘వచ్చే ఈ ఏడాది కాలంలో మా ఆర్థిక పరిస్థితులు బాగానే ఉంటాయనిపిస్తున్నది. అయినప్పటికీ ఏది కొనాలన్నా ఒకటికి పదిసార్లు ఆగి ఆలోచించాల్సి వస్తోంది. అన్ని వస్తువులు, సేవల ధరలు అమాంతం పెరిగిపోయాయి’ ఇదీ.. ఇప్పుడు దేశంలోని అత్యధిక ప్రజల ఆందోళన.. ఆవేదన. తాజాగా విడుదలైన ఈవై ఫ్యూచర్ కన్జ్యూమర్ ఇండెక్స్ ఫర్ ఇండియా తొమ్మిదో ఎడిషన్.. భారత్లో ధరల మోతకు అద్దం పట్టింది. ద్రవ్యోల్బణం తీరును చాటిచెప్పింది.
తమ కొనుగోలు నిర్ణయాలను పెరిగిన ధరలు చాలా ప్రభావితం చేస్తున్నాయని సర్వేలో పాల్గొన్న మెజారిటీ వినియోగదారులు పేర్కొన్నట్టు ఓ నివేదికలో ఈవై తెలియజేసింది. దేశంలో జీవన వ్యయాలు 80 శాతానికిపైగా పెరిగాయని, ఇలా పెరుగుతూపోతున్న ధరల్ని భరించడం కష్టమేనని, కనీస అవసరాలను తీర్చుకోవడానికీ మరింత ఖర్చు పెట్టాల్సి వస్తున్నదని చెప్పింది.
రాబోయే ఏడాది కాలంలో తమ ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగవుతాయన్న ఆశాభావం 77 శాతం మంది భారతీయ వినియోగదారుల్లో కనిపించింది. ఆశించిన స్థాయిలోనే ఆదాయం పెరుగుతుందన్న విశ్వా సం వీరిలో తొణికిసలాడింది. ఇతర ప్రపంచ దేశాలతో పోల్చితే ఇది ఎంతో ఎక్కువ. చాలా దేశాల్లో ఈ తరహా నమ్మకం 48 శాతంగానే ఉన్నట్టు ఈవై రిపోర్టు చెప్పింది.
అయితే పెరుగుతున్న ధరలు ఈ ఆనందాన్ని ఆవిరి చేస్తున్నది. ‘వస్తూత్పత్తులు, సేవల ధరలు అంతకంతకూ పెరుగుతూపోతున్నాయి. దీనివల్ల మాకు కావాల్సినవి మేము కొనలేకపోతున్నాం. కొన్నాలన్న మా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడమో, వాయిదా వేసుకోవడమో చేయాల్సి వస్తున్నది’ అని ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరి లో దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా కన్జ్యూమర్ల అభిప్రాయాలతో జరిగిన ఈ సర్వే వివరించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 18వేల మంది అభిప్రాయాలను సేకరించారు.
ద్రవ్యోల్బణం.. పొదుపును దెబ్బతీస్తున్నది. ఖర్చుల కోసం ఇంకా ఎక్కువగా కూడబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని తాజా సర్వేలో ఈవై వెల్లడించడం గమనార్హం. చేసే ఖర్చుల కంటే వాటి కోసం పోగేయాల్సిన సొమ్మే ఎక్కువవుతున్నది. ఈ క్రమంలో ద్రవ్యోల్బణ ప్రభావం ఇలాగే కొనసాగితే సేవింగ్స్ పడిపోయే ప్రమాదముందన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.‘
పెరుగుతున్న ధరలు వినియోగదారుల కొనుగోలు శక్తిని దెబ్బతీస్తున్నాయి. ఫలితం గా మార్కెట్లో అమ్మకాలు పడిపోతుండ గా.. వ్యాపారులు, ఉత్పాదక సంస్థల లాభా లు తగ్గిపోతున్నాయి. దీర్ఘకాలంలో కొనుగోలుదారుల నిర్ణయాలు ప్రభావితమయ్యే వీలున్నది. అలాగే కరోనా నేపథ్యంలో కస్టమర్ల అభిరుచులు, ఆలోచనల్లో కూడా చాలా మార్పులే వచ్చాయి’
– అంగ్షుమన్, ఈవై ఇండియా ప్రతినిధి