వర్ని/వేల్పూర్, అక్టోబర్ 21: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా విరివిగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పాత వర్నిలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, వేల్పూర్లో గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వేల్పూర్లో మంత్రి వేముల మాట్లాడుతూ.. రైతుకు ఏ ఆపద వచ్చినా ముందు నిలిచేది సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. సీఎం దార్శనికతకు, రైతులపై ఉన్న ప్రేమకు కొనుగోలు కేంద్రాలే నిదర్శనమన్నారు. పొరుగునే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలో కొనుగోలు కేంద్రాలు లేవని గుర్తుచేశారు. కేసీఆర్ ఢిల్లీలో మూడు రోజులపాటు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసి.. ఒప్పించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. వర్నిలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. కష్టించి పండించిన ధాన్యాన్ని విక్రయించడంలో రైతులు దళారులను ఆశ్రయించొద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు.