అమరావతి : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. గతనెల మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడి గా ఉన్న అనంతబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని మే 23న రిమాండ్కు పంపించారు. అప్పటి నుంచి రెండుసార్లు బెయిల్ కు పిటిషన్ దాఖలు చేసుకోగా కోర్టు తిరస్కరించింది.
మరోసారి రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టుకు చేసుకున్న దరఖాస్తును ఇవాళ కోర్టు కొట్టివేస్తూ రిమాండ్ను పొడిగించింది. జులై 1వ తేదీవరకు రిమాండ్లో ఉంచాలని ఆదేశించింది. హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుడు కావడంతో ఎమ్మెల్సీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును పోలీసులు నమోదు చేశారు. కేసు దృష్ట్యా బెయిల్ ఇవ్వడం కుదరదని న్యాయవాదికి వివరించింది.