మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 26 : పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములైన పాఠశాల యాజమాన్య కమిటీలకు ప్రభుత్వం తీపికబురు అందించింది. కాలపరిమితిని మరో 6 నెలలు పొడిగిస్తూ శుక్రవారం విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. 2019 నవంబర్ మాసంలో పాఠశాలల యాజమాన్య కమిటీలను ఎన్నుకున్నారు. ఇందులో మహిళలకు పెద్దపీట వేశారు. ప్రతి తరగతి నుంచి ముగ్గురు సభ్యుల్లో ఇద్దరు మహిళలను తప్పనిసరి ఎన్నుకోవాలి. ఎన్నికైన వారే పాఠశాల చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోవాలి. చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికల్లో రెండింటిలో ఒకరిని మహిళనే ఎన్నుకోవాలి. రెండు సంవత్సరాల గడువు నవంబర్ 30తో ముగియనుండటంతో ప్రభుత్వం 6 నెలల పాటు తిరిగి పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉతర్వులు జారీ చేశారు. దీంతో ప్రస్తుత పాత కమిటీలే 2022, మే 31వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
పాఠశాల యాజమాన్య కమిటీ అంటే..
విద్యాహక్కు చట్టం అమలులో ప్రజలు భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సంస్థ పాఠశాల యాజమాన్య కమిటీ. పాఠశాలల నిర్వహణ, యాజమాన్యాలను చూసుకోవడానికి పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ. పాఠశాల సక్రమంగా నడిచేలా అజమాయిషీ చేయడం, కావాల్సిన సదుపాయలను కల్పిస్తూ పాఠశాలలను అభివృద్ధి చేయడం దీని ప్రధాన బాధ్యత. పాఠశాలలో చదివే పిల్లల తల్లిదండ్రులే ఈ కమిటీలో ప్రధాన బాధ్యత గల సభ్యులు. కాలపరిమితి పాఠశాల యాజమాన్య కమిటీకి రెండేండ్ల కాలపరిమితి ఉంటుంది. కమిటీ సభ్యుడి పిల్లలు పాఠశాలను వదిలి వెళ్లినట్లయితే ఆ సభ్యుడు పదవి కోల్పోతారు. పాఠశాల ప్రారంభ తరగతిలో చేరిన విద్యార్థుల తల్లిదండ్రులు పాత సభ్యుల స్థానంలో కొత్త సభ్యులను ఎంపిక చేసుకోవాలి. తరగతిలోని పిల్లల తల్లిదండ్రులతో ఎవరో ఒకరికి మాత్రమే కమిటీ సభ్యుల ఎన్నికల్లో ఓటు వేసే అర్హత ఉంటుంది. ఎక్కువ తరగతుల్లో చదువుకునే పిల్లలున్న తల్లిదండ్రులకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.
పర్యవేక్షకుల బాధ్యత కమిటీలదే..
పాఠశాల పనితీరు, హాజరు పెంచడం, బడి బయట పిల్లలను చేర్పించడం, విద్యార్థుల ప్రగతి, పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, ఉపాధ్యాయులు మెరుగైన బోధన విషయాలు, పాఠశాలకు మంజూరైన నిధులు తదితర విషయాలపై శ్రద్ధపెట్టాల్సిన అవసరం ఉంటుంది.
మరో 6 నెలల అవకాశం వచ్చింది..
పాఠశాల యాజమాన్య కమిటీలకు ప్రభుత్వం మరో 6 నెలలు పొడిగించి అవకాశం కల్పించింది. విద్యార్థులకు ఇబ్బందులు కలుగుకుండా చూస్తాం. పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నాం. పిల్లల చదువుపై ఆరాతీస్తున్నాం. ఆరు నెలలు పొడిగించడంతో పాఠశాల అభివృద్ధికి సహకారం అందిస్తాం.
ఉత్తర్వులు వచ్చాయి..
పాఠశాల యాజమాన్య కమిటీలను మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఆరు నెలల పాటు పాత కమిటీలే కొనసాగుతాయి.