AIADMK : తమిళనాడు (Tamil Nadu) లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరిగినప్పటి నుంచి అన్నాడీఎంకే (AIADMK) కు దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉంది. పళనిస్వామి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ పలువురు నేతలు అధికార టీవీకే (TVK) లో చేరుతున్నారు. తాజాగా ఆ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన కీలక నేతలు, మాజీ మంత్రులు డాక్టర్ సీ విజయభాస్కర్ (Vijay Bhasker), ఎంఆర్ విజయభాస్కర్ (MR Vijay Bhasker) అధికార తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీలో చేరారు. వీరితోపాటు సుమారు 15 వేల మంది మద్దతుదారులు కూడా పార్టీ మారడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
చెన్నై సమీపంలోని మామల్లపురంలో గల ఒక ప్రైవేట్ హోటల్లో గురువారం ఈ భారీ చేరికల కార్యక్రమం జరిగింది. టీవీకే ప్రధాన కార్యదర్శి ఎన్ ఆనంద్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. మంత్రి ఆధవ్ అర్జున కొత్తగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అన్నాడీఎంకే నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితోనే తాము పార్టీ మారుతున్నట్లు మాజీ మంత్రులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీ విజయభాస్కర్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు, తర్వాత కూడా టీవీకేతో పొత్తు పెట్టుకోవాలని తాము పార్టీ అధిష్ఠానానికి పలుమార్లు సూచించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
ఎంజీఆర్ సిద్ధాంతాలకు విరుద్ధంగా డీఎంకేతో పొత్తుకు ప్రయత్నిస్తుండటంతో తాము పార్టీలో ఇమడలేకపోయామని తెలిపారు. ప్రజల్లో అపారమైన విశ్వాసం నింపిన విజయ్ నాయకత్వంలోని టీవీకేలో చేరడమే సముచితమైన నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన అతిపెద్ద చేరికల్లో ఇది ఒకటి. ఈ ఇద్దరు మాజీ మంత్రులతోపాటు మరో మాజీ మంత్రి ఎస్ వలర్మతి, ఎంఎస్ఎం ఆనందన్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, 208 మంది యూనియన్ కార్యదర్శులు కూడా టీవీకేలో చేరారు.
కరూర్, పుదుక్కోట్టై జిల్లాల నుంచి సుమారు 200 బస్సులు, 600 కార్లలో భారీ సంఖ్యలో మద్దతుదారులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ చేరికలు కేవలం ‘ట్రైలర్’ మాత్రమేనని, రాబోయే ఎన్నికల్లో టీవీకే వంద శాతం విజయం సాధిస్తుందని విజయభాస్కర్ ధీమా వ్యక్తంచేశారు.