ఇల్లందకుంట : టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్ధాల కలను సహకారం చేసి తెలంగాణను తెచ్చిన సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈటల రాజేందర్కు ఆర్థిక శాఖను అప్పగించినట్లు చెప్పారు. ఈటల రాజేందర్ ఏనాడు పేద ప్రజల గురించి పట్టించుకోలేదన్నారు. 24గంటలు సీఎం కేసీఆర్ పని చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ కోసం ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కలిసి గ్రామగ్రామాన ఇంటింటికి వెళ్లి గెల్లు శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జనగాం జడ్పీ చైర్మన్ సంపత్రెడ్డి, గజ్వేల్ ఏఎంసీ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్, ఎంపీటీసీ ఎక్కటి సంజీవరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సరిగొమ్ముల వెంకటేష్, రాంస్వరణ్రెడ్డి, కుమార్, తిరుపతి, వేణు, విక్రమ్, కుమార్, కొమురెల్లి తదితరులున్నారు.