Wasim Akram : ‘ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ – 2025 (ICC Champions Trophy – 2025)’ లో పాకిస్థాన్ (Pakistan) కథ ముగిసింది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగిన పాకిస్థాన్.. గ్రూప్ స్టేజిలోనే వరుసగా రెండు మ్యాచ్లలో ఓటమిపాలై మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి మ్యాచ్లో న్యూజీలాండ్ (New Zealand) చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిన రిజ్వాన్ (Rizwan) టీమ్.. తర్వాత మ్యాచ్లో భారత్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది.
పాక్ జట్టు గ్రూప్ స్టేజిలోనే ఇంటిముఖం పట్టడాన్ని ఆ దేశ మాజీ క్రికెటర్లు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. యావత్ పాకిస్థాన్ తమ క్రికెట్ జట్టు ప్రదర్శనపై మండిపడుతోంది. పాక్ మాజీ క్రికెటర్లు పలువురు తమ జట్టు ఆటతీరును ఏకి పారేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ రిజ్వాన్ సేనపై విమర్శలు గుప్పించాడు. భారత్తో మ్యాచ్లో పాక్ ఆటగాళ్లు సరైన డైట్ కూడా పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
డైట్ పాటించకపోవడంతో ఆటగాళ్లు ఫిట్గా లేరని, భారత్తో జరిగిన మ్యాచ్లో డ్రింక్స్ సమయంలో ఆటగాళ్ల కోసం ఒక ప్లేట్ నిండా అరటిపండ్లు ఉండటం చూశానని, కోతులు కూడా అన్ని అరటి పండ్లు తినవని, మా ఆటగాళ్లు మాత్రం కోతుల కంటే ఎక్కువగా తింటున్నారని వసీం అక్రమ్ మండిపడ్డారు. చెత్త ప్రదర్శన చేసినందుకు జట్టుపైన, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపైన తీవ్ర చర్యలు తీసుకోవాలని, పాకిస్థాన్ జట్టులో ఏమాత్రం పురోగతి లేదని విమర్శించారు.
పాక్ జట్టులో మార్పులు జరగాలని, భయంలేని క్రికెటర్లు, యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని, ప్రస్తుత జట్టులో కచ్చితంగా ఐదారు మార్పులు చేయాలని వసీం అక్రమ్ సూచించారు. ఇప్పటికైనా తప్పులు తెలుసుకుని 2026 టీ20 ప్రపంచకప్కు జట్టును సిద్ధం చేయాలని అన్నారు. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన పాకిస్థాన్ జట్టు గురువారం బంగ్లాదేశ్తో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.