యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలోని ప్రతిష్టామూర్తులకు శనివారం నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీ నరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేసి హారతి నివేదనలు అర్పించారు.
ఉదయం 8 గంటలకు సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. ప్రతీరోజు నిర్వహించే నిత్య కల్యాణోత్సవంలో భక్తు లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపారు.
సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన, పుష్కరిణి వద్ద క్షేత్రపాలక ఆంజ నేయస్వామివారికి జరిగిన పూజల్లో కూడా భక్తులు పాల్గొన్నారు. కొండ కింద వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రతాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్య క్షేత్రం లో నిత్యపూజలు కోలాహలం నెలకొంది. ఉదయం నుంచి రాత్రి వరకు స్వామి వారి దర్శనాలు నిరాటంకంగా సాగాయి.