హైదరాబాద్ : తెలంగాణ పేరిట ఆర్మీ రెజిమెంట్ను ఏర్పాటు చేయాలని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ను కోరారు. ఈ మేరకు శనివారం ఆయన కేంద్రమంత్రికి లేఖ రాశారు. తెలంగాణకు ఇండియన్ ఆర్మీ ఇంఫ్యాన్ట్రీ రెజిమెంట్ ఏర్పాటు ఆవశ్యకతను వినోద్ కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ప్రతినిధులు వినోద్ కుమార్తో సమావేశమై ఇండియన్ ఆర్మీ కొత్తగా మూడు బెటాలియన్స్ను ఏర్పాటు చేయనున్న విషయాన్ని తెలిపారు.
రెజిమెంట్ను నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని రక్షణ మంత్రిని కోరారు. గతంలో హైదరాబాద్ పేరిట 19వ బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ రెజిమెంట్ ఉండేదని.. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో హైదరాబాద్ ఆర్మీ పాలుపంచుకుందని లేఖలో తెలిపారు. లష్కర్ హైదరాబాద్ రెజిమెంట్ మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా, పర్షియా, మలయా, సింగపూర్, బర్మా యుద్ధాల్లో పాల్గొందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్మీ రెజిమెంట్లో తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉందని, దీంతో అనేక అంశాల్లో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని అన్నారు.
తెలంగాణ ప్రాంతానికి, హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు ఇండియన్ ఆర్మీకి సేవలు అందించడంలో, యుద్ధ రంగంలో అపారమైన సేవలు అందించిన చరిత్ర ఉందని తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు ఉన్నాయని, ఎకో సిస్టం కలిగి ఉందని వినోద్ కుమార్ వివరించారు. ఇటీవల ఇండియన్ ఆర్మీ కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందిన సందర్భంలో సీఎం కేసీఆర్ మనస్ఫూర్తిగా స్పందించారని పేర్కొన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలు, కులాల పేరిట ఆర్మీ రెజిమెంట్లు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
పంజాబ్ రాష్ట్రంలో పంజాబ్, సిఖ్, డోగ్రా రెజిమెంట్లు ఉన్నాయని, హర్యానాలో జాట్ రెజిమెంట్, జమ్మూకశ్మీర్లో జమ్మూ అండ్ కశ్మీర్ రైఫిల్స్, రెజిమెంట్, డోగ్రా రెజిమెంట్లు ఉన్నాయన్నారు. రాజస్థాన్లో రాజ్ రైఫిల్స్, రాజపుత్, జాట్ రెజిమెంట్లు, బీహార్లో బీహార్ రెజిమెంట్, మహారాష్ట్రలో మరాఠా, మహార్ రెజిమెంట్లు, అసోంలో అసోం, నాగా రెజిమెంట్లు ఉన్నాయని చెప్పారు. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు కలిపి మద్రాస్ రెజిమెంట్ మాత్రమే ఉందని వినోద్కుమార్ పేర్కొన్నారు. దీన్నిదృష్టిలో ఉంచుకొని తెలంగాణ పేరిట రెజిమెంట్ ఏర్పాటు చేయాలని కోరారు.