శ్రీశైలం : శ్రీశైల దేశస్థాన కార్యనిర్వహణాధికారిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో సహకరించిన ఆలయ ఉద్యోగులు, సిబ్బందికి ఈవో కేఎస్.రామారావు కృతజ్ఞతలు తెలిపారు. బదిలీపై వెళ్తున్న కె.ఎస్. రామారావు గురువారం దేవస్థానం ఉద్యోగులతో సమావేశమయ్యారు. దేవస్థాన పరిపాలనా భవనములో జరిగిన ఈ సమావేశానికి అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, అర్చకస్వాములు, వేదపండితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో తనకు సహకరించిన దేవస్థాన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
తన పదవీ కాలంలో పలు వినూత్న కార్యక్రమాలు చేపట్టి విజయవంతమవడం సంతోషకరమన్నారు. కరోనా వ్యాప్తి సమయములోనూ అర్చకస్వాములు, ఉద్యోగులు తగు జాగ్రత్తలు పాటిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అదేవిధంగా కరోనా కాలంలో శ్రీశైల క్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తుల కోసం ఆయా సేవలను ప్రవేశపెట్టడం ఈ సేవలకు భక్తుల నుంచి అనూహ్య స్పందన లభించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.
ఇక ఆలయాన్ని దర్శించే భక్తులందరికి కూడా శ్రీస్వామివార్ల ప్రసాదం అందించాలనే సంకల్పముతో నిరంతర ప్రసాద వితరణను చేపట్టడం జరిగిందన్నారు. చెంచుగూడాలలో ధర్మప్రచార నిర్వహణకుగాను ‘మా స్వామి.. మల్లన్’ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. గో ఉత్పత్తుల తయారీ, విక్రయాలను ప్రారంభించడం జరిగిందన్నారు. స్థానికులు, యాత్రికుల సౌకర్యార్థం నిరంతర వైద్యసేవలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.
సనాతన సంస్కృతి పరిరక్షణలో భాగంగా శ్రీశైల క్షేత్రములో మొట్టమొదటిసారిగా వేదసభను నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా భక్తులలో దేవతా వృక్షాలపై అవగాహన కల్పించేందుకు నక్షత్రవనం పనులు ప్రారంభించినట్లు చెప్పారు. నూతన వధూవరులను దేవస్థానం తరుపున ఉచితంగా ఆశీర్వదించేందుకు సౌభాగ్యమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇప్పటికే శ్రీశైలఖండం తెలుగు, సంస్కృత భాషలలో ప్రచురించడం జరిగిందన్నారు. ఈ శ్రీశైలఖండం కన్నడ, ఆంగ్ల భాష అనువాద కార్యక్రమాన్ని కూడా చేపట్టబడిందన్నారు. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు రామారావు పేర్కొన్నారు.