Richest Candidate | తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఏపీలో లోక్సభతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. పలు పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అయితే, గుంటూరు లోక్సభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. నామపత్రాల్లో ఆయన సమర్పించిన ఆస్తుల వివరాలు అందరినీ షాక్కు గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో పీ చంద్రశేఖర్ దేశంలో అత్యంత సంపన్న రాజకీయ నేతగా నిలిచారు.
ఆయన ఆస్తుల వివరాలు తెలిస్తే అందరూ నోరెళ్లబెట్టడం ఖాయం. చంద్రశేఖర్ కుటుంబీకుల ఆస్తుల విలువ అక్షరాల రూ.5,705 కోట్లు. ఈ విషయాన్ని ఆయన ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. అదే సమయంలో తనకు రూ.1,038 కోట్ల అప్పులున్నట్లుగా తెలిపారు. దేశంలో ఇంత మొత్తంలో ఆస్తులు చూపిన నేతగా చంద్రశేఖర్ నిలిచారు. చంద్రశేఖర్ పేరిట రూ. 2,316 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఆయన భార్య శ్రీరత్న పేరిట రూ.2,289కోట్లు, అలాగే పిల్లల పేరిట రూ.992 కోట్ల స్థిరాస్తులు పేర్కొన్నారు. అలాగే, బెంజ్, టెస్లా, రోల్స్రాయిస్, ఫార్చ్యూనర్ కార్లు ఉన్నాయని తెలిపారు.
చంద్రశేఖర్ పేరిట రూ.72కోట్ల విలువైన భూములు, భవనాలు.. భార్య పేరిట 34,82కోట్ల విలువైన భూములు ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వద్ద నగదు రూ.2,06,400.. భార్య శ్రీరత్న వద్ద రూ.1,51,800, కొడుకు వద్ద రూ.16,500, కూతురు వద్ద రూ.15,90 నగదు ఉన్నట్లు వివరించారు. చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ. 20 సంవత్సరాల కిందట వైద్యవిద్యను పూర్తి చేసేందుకు అమెరికా వెళ్లిన ఆయన.. అక్కడే స్థిరపడ్డారు. అక్కడే వైద్యవృత్తికి సంబంధించి ఆయన ఆన్లైన్ శిక్షణ కోర్సును ప్రారంభించారు. దాంతో పాటు ‘యు వరల్డ్’ అనే సంస్థను స్థాపించి వైద్య విద్య, నర్సింగ్, హైస్కూలు, గ్రాడ్యుయేషన్, అకౌంటింగ్, ఫైనాన్స్, లీగల్, ఫార్మసీ రంగాల్లో సేవలు అందించారు.