హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లోని 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరంలో 9వ తరగతి, 2024-25 నుంచి 10వ తరగతులకు ప్రారంభిస్తామని చెప్పారు. ఇంగ్లిష్ మీడియం బోధనపై ఈ నెల 14 నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. విద్యార్థుల సౌలభ్యం కోసం ద్విభాషా పుస్తకాలను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో మనఊరు-మనబడి కార్యక్రమంపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 8న విద్యాయజ్ఞానికి శ్రీకారం చుట్టారని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరారు. మనఊరు-మనబడి కార్యక్రమం మొదటి దశలో భాగంగా మండలం యూనిట్గా అత్యధిక విద్యార్థులున్న 9,123 పాఠశాలలను ఎంపిక చేశామని, రెండో దశలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకొంటామని స్పష్టంచేశారు. రూ.2 లక్షలు విరాళం ఇస్తే ఎస్ఎంసీ కమిటీలో సభ్యత్వం, రూ.10 లక్షలు ఇస్తే ఒక తరగతి గదికి, రూ.25 లక్షలు ఇస్తే ప్రాథమిక పాఠశాలకు, రూ.50 లక్షలు ఇస్తే ప్రాథమికోన్నత పాఠశాలకు, రూ.కోటి ఇస్తే ఉన్నత పాఠశాలకు దాతల పేర్లు లేదా వారు సూచించిన పేర్లు పెడతామని చెప్పారు. త్వరలోనే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేస్తామని, పాత విద్యాకమిటీలనే కొనసాగిస్తామని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం బకాయీల చెల్లింపునకు చర్యలు తీసుకొంటున్నట్టు తెలిపారు.