రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యాబోధన భావితరాలకు ఉజ్వల పునాది. రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన సాగాలనేది ప్రజల చిరకాల వాంఛ. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవటం హర్షణీయం. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇది అమలవుతుంది. ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని బడుగు బలహీన వర్గాల, ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల్లోని పేదల పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ప్రజలు ఆనందపడుతున్నారు.
నాడు ప్రైవేటు బడుల్లో పిల్లల్ని చదివించడం ఆర్థికబారంతో కూడుకున్నది. సంపాదనలో సగం పిల్లల చదువులకే సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆంగ్ల మాధ్యమ ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి మండలంలోని మర్రిగడ్డ గ్రామానికి చెందిన ప్రాథమిక పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం లేదని నాలుగేండ్ల కిందట మూతపడింది. దీంతో అక్కడున్న ఉపాధ్యాయులు పక్క పాఠశాలకు డిప్యుటేషన్ వెళ్లాల్సి వచ్చింది. ఇటీవల అక్కడి తల్లిదండ్రులు ఏకమై కేటీఆర్ చొరవతో తమ పాఠశాలను తిరిగి తెరిపించారు. ఆంగ్ల మాధ్యమం అనుమతి కోసం విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపారు. ఆంగ్ల మాధ్యమం పట్ల తల్లిదండ్రుల్లో ఉన్న విశ్వాసానికి ఈ ఉదంతం చక్కటి నిదర్శనం.
ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమంలో చదివిన విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసనం సులువు అవుతుంది. ఆంగ్లంలో చదువని విద్యార్థులు ఆత్మన్యూనతకు గురవుతారు. అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతారు. పాఠశాల దశ నుంచే ఆంగ్లంలో చదివిన విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై రాణించడానికి అవకాశం ఉన్నది. ప్రైవేట్, కార్పొరేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. నేటి ఆధునిక, సాంకేతికయుగంలో విషయ అవగాహనకు మెరుగైన మెటీరియల్ ఆంగ్లంలోనే లభ్యమవుతుంది. దీంతో తమ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వారిని ఆంగ్లంలో చదివించాలని తల్లిదండ్రులు తపన పడుతున్నారు. ఈ నేపథ్యంలోంచే రాష్ట్ర ప్రభుత్వం అన్ని సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టే చారిత్రక నిర్ణయం తీసుకున్నది.
పునాది స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం వల్ల తెలంగాణ యువత మేలిమి మానవ వనరుగా తయారవుతుంది. జాతీయ, అంతర్జాతీయ అవకాశాలను మరింత ఎక్కువగా అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. దశాబ్దాలుగా ఆధునిక చదువులకు నోచుకోలేక ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా వెనుకబడిన తెలంగాణ ప్రాంత ప్రజల జీవనంలో ఆంగ్ల మాధ్యమంతో నూతన శకం ఆరంభమవుతుందనటంలో సందేహం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు ఉచిత, నాణ్యమైన విద్య అందించేందుకు ఈ నిర్ణయం ఎంతో తోడ్పడుతుంది. ఇప్పటికే గురుకులాల్లో ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్య అందిస్తున్నారు. ప్రాథమికస్థాయి నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడితే, కేజీ టు పీజీ ఉచిత నాణ్యమైన విద్య సాకారమయ్యే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి, మౌలిక సదుపాయాల కల్పనకు ‘మన ఊరు- మన బడి’ పేరిట రూ.7,289 కోట్లతో ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిది. అందుకోసం పైలట్ ప్రాజెక్టుగా పనులు చేపట్టింది. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లి, జిల్లెలగూడలోని ఉన్నత ప్రాథమిక పాఠశాల నిర్మాణం కోసం ఇప్పటికే రూ.3.57 కోట్లు వెచ్చించింది. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం కింద 12 విభాగాలను ప్రభుత్వం గుర్తించింది. అందులో నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు-సిబ్బందికి సరిపోయే ఫర్నీచర్, పాఠశాలకు రంగులు, సున్నం వేసి అందంగా తీర్చిదిద్దటం, అన్నిరకాల మరమ్మతులు చేపట్టడం, ‘గ్రీన్ చాక్ బోర్డు’ల ఏర్పాటు, ప్రహరీ గోడల నిర్మాణం, కిచెన్ షెడ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్రూముల నిర్మాణం చేపడుతారు. అలాగే ఉన్నత పాఠశాలల్లో డైనింగ్హాల్స్ ఏర్పాటు, డిజిటల్ విద్య అమలుచేయటానికి సకల హంగులను కల్పిస్తుంది.
‘మన ఊరు-మన బడి’ పథకంతో మన బడులలో మౌలిక వసతుల కల్పనతో ఆధునికత సంతరించుకోవడం తెలంగాణ చరిత్రలో నూతన అధ్యాయం. ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటు తెలంగాణ అభివృద్ధి వికాసాల్లో నవ శకం. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం పేదవాడి పేగు బంధమైన కేసీఆర్కే సాధ్యం.
(వ్యాసకర్త: రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం)
–డాక్టర్ బండారు వీరబాబు
99488 21220