పాఠశాల స్థాయి నుంచే ఇంగ్లిష్ మీడియంలో చదివితే పాఠ్యాంశాలపై పట్టు ఉంటుంది. జాతీయ స్థాయిలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశాలు మెరుగుపడుతాయి. ఇంగ్లిష్ వల్ల ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువతలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంటర్వ్యూలను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఇంగ్లిష్ మీడియం అవసరమే. కానీ సంస్కృతి, సంప్రదాయాలను కూడా తెలుసుకోవాలి. అందుకోసం సమాంతరంగా విద్యార్థులంతా తెలుగు నేర్చుకోవాలి. ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు బోధిస్తూనే.. తెలుగును తప్పనిసరి చేయాలి.
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 26: ఇంగ్లిష్ మీడియంలో చదువుకొన్న వారికి ప్రపంచం చాలా చిన్నదిగా కనిపిస్తుందని, ఆత్మ విశ్వాసంతో ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడటం తేలికవుతుందని ఎన్ఐటీ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు పేర్కొన్నారు. ఇంగ్లిష్పై పట్టు సాధిస్తే విదేశాల్లోనూ ఉద్యోగాలు చేయవచ్చని చెప్పారు. సికింద్రాబాద్లోని పికెట్ కేంద్రీయ విద్యాలయంలో ఇంగ్లిష్ మీడియంలోనే చదువుకొన్న ఆయన జేఎన్టీయూలో రిజిస్ట్రార్గా చాలాకాలం పనిచేశారు. ప్రస్తుతం జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన ఎన్ఐటీ వరంగల్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మన ఊరు-మన బడి మంచి కార్యక్రమమని రమణారావు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమంలో బోధించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లో..
ఇంగ్లిష్లోనే పుష్కలంగా స్టడీ మెటీరియల్
ఇంగ్లిష్ చదువుల వల్ల తెలంగాణ యువతకు బంగారు భవిష్యత్తును సీఎం కేసీఆర్ ఇచ్చినట్టవుతుంది. ఐఐటీలు, మెడికల్ కాలేజీలు ఎన్ఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందడం ఇంగ్లిష్ మీడియంలో చదివినవారికే సులభమవుతుంది. గూగుల్ ద్వారా కావాల్సినంత స్టడీ మెటీరియల్ను సొంతంగా సేకరించుకుని ప్రిపేర్ కావాలంటే ఇంగ్లిష్ మీడియంలో చదివి ఉంటేనే మేలు.
ఉద్యోగాలు సాధించొచ్చు
పాఠశాల స్థాయి నుంచే ఇంగ్లిష్ మీడియంలో చదివి ఉండటంతో పాఠ్యాంశాలపై పట్టు ఉంటుంది. జాతీయ స్థాయిలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశాలు మెరుగుపడుతాయి. ఇంగ్లిష్ వల్ల ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువతలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంటర్వ్యూలను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఇంగ్లిష్ మీడియం అవసరమే. కానీ సంస్కృతి, సంప్రదాయాలను కూడా తెలుసుకోవాలి. అందుకోసం సమాంతరంగా విద్యార్థులంతా తెలుగు నేర్చుకోవాలి. ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు బోధిస్తూనే.. తెలుగును తప్పనిసరి చేయాలి.
ఎన్ఐటీలో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులే
పాఠశాల విద్యను నేను ఇంగ్లిష్లో చదువుకోవడం వల్ల సివిల్ ఇంజినీరింగ్ పీహెచ్డీ సులభంగా పూర్తిచేయగలిగా. అంతర్జాతీయ వేదికలపై ఎన్నో లెక్చర్లు ఇచ్చాను. ఎన్ఐటీ వరంగల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థుల్లో దాదాపు ఇంగ్లిష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వారే. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
ఆంగ్ల మాధ్యమం చరిత్రాత్మకం -బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం
హైదరాబాద్, జనవరి 26 : ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం చరిత్రాత్మక నిర్ణయమని, పేద విద్యార్థులకు వరమని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు పేర్కొన్నారు. మేదర సంఘం ఆధ్వర్యంలో అంబర్పేటలో బుధవారం నిర్వహించిన ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టడం వల్ల పేద విద్యార్థులకు ఎంతో లబ్ధి చేకూరనున్నదని, ఉజ్వల భవిష్యత్కు నాంది పలుకనున్నదని తెలిపారు. కార్యక్రమంలో మేదర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళీకృష్ణ, నాయకులు ప్యారసాని బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆంగ్ల మాధ్యమంతో బడుగుల్లో వెలుగు -ఎంబీసీ రాష్ట్ర కో కన్వీనర్ కొండూరు
హైదరాబాద్, జనవరి 26 : బడుగు, బలహీనవర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని తెలంగాణ రజక సంఘాల సమితి రాష్ట్ర చీఫ్ అడ్వయిజర్, ఎంబీసీ రాష్ట్ర కో కన్వీనర్ కొండూరు సత్యనారాయణ కొనియాడారు. హైదరాబాద్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ప్రభుత్వ స్కూళ్ల ముఖచిత్రమే మారిపోనున్నదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవం, అన్ని అర్హతలు కలిగిన ఉపాధ్యాయులున్నారని, భావితరాలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. తల్లిదండ్రులపై ఆర్థిక భారం తప్పనున్నదని తెలిపారు. సమావేశంలో ఎంబీసీ రాష్ట్ర కో కన్వీనర్లు రాసమల్ల బాలకృష్ణ, వడపల్లి మాధవ్, కోట్ల శ్రీనివాస్, కోల శ్రీనివాస్, నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.