ENG vs PAK : ముల్తాన్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులోనూ ఇంగ్లండ్ బౌలర్లు అద్భుతం చేశారు. దాంతో, పాకిస్థాన్పై 26 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్లో పేసర్ మార్క్వుడ్ నాలుగు వికెట్లతో (4-65) పాక్ పతనాన్ని శాసించాడు. 354 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. మిడిలార్డర్ బ్యాటర్లు సాద్ షకీల్ (94), ఇనాముల్ హక్ (60) మాత్రమే రాణించారు. దాంతో, ఇప్పటికే మొదటి టెస్టులో నెగ్గిన ఇంగ్లండ్ ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్లో 2-0 ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన హ్యారీ బ్రూక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. పాక్ గడ్డపై ఇంగ్లండ్ ఒక టెస్ట్ సిరీస్లో రెండు మ్యాచ్లు గెలవడం ఇదే మొదటిసారి. అంతేకాదు స్వదేశంలో వరసగా మూడు టెస్టుల్లో పాకిస్థాన్ ఓడిపోవడం 63 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం.
ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 556 రన్స్ చేసింది. మొదటి ఇన్నింగ్స్లో పాక్ యువ బౌలర్ అబ్రర్ అహ్మద్ ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. ఆరంగ్రేటం మ్యాచ్లోనే ఈ లెగ్ స్పిన్నర్ 7వికెట్లు తీశాడు. ఓపెనర్ బెన్ డకెట్ (63), ఓలి పోప్ (60) పరుగులతో రాణించడంతో ఇంగ్లండ్ 281 రన్స్కే పరిమితమైంది. మొదటి ఇన్నింగ్స్లో పాక్ ఓపెనర్లు శుభారంభం ఇవ్వడంలో విఫలం అయ్యారు. కెప్టెన్ బాబర్ ఆజాం (75), సాద్ షకీల్ (63) అర్థ సెంచరీలు చేశారు. స్పిన్నర్ జాక్ లీచ్ 4 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ సెంచరీ (108)తో ఇంగ్లండ్ జట్టును ఆదుకున్నాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ 41 పరుగులతో రాణించాడు. 354 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 328 రన్స్కు ఆలౌట్ అయింది.