రాజౌరీ : దక్షిణ కశ్మీర్ జిల్లా అయిన షోఫియాన్లో భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. షోఫియాన్ జిల్లా పరిధిలోని చుర్ కి గాలి అనే ప్రాంతంలో సెడోవ్, హిర్పోరా మధ్య అరణ్యాలలో ఉగ్రవాదులు నక్కినట్లుగా అందిన పకడ్బందీ సమాచారం మేరకు భద్రతా దళాలు ఆ ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి.
ఉగ్రవాదులు కనిపించగానే లొంగిపోవాల్సిందిగా భారత సైన్యం హెచ్చరించినప్పటికీ వినిపించుకోకుండా కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో సైనికులు కూడా ఎదురుకాల్పులకు దిగారు.
ఇక్కడ ఆర్మీ, సీఆర్పీఎఫ్ సంయుక్త బృందం ఐదుగురుఉగ్రవాదులను ముట్టడించినట్లు స్థానిక పోలీసులు చెప్తున్నారు. రెండు వైపుల నుంచి కాల్పులు జరుగుతున్నాయి. అడవి దట్టంగా ఉన్నందున ఉగ్రవాదుల ఉనికి సరిగా గుర్తించలేకపోతున్నారు. వారిని చుట్టుముట్టడానికి అదనపు భద్రతా దళాలను పిలిపించారు.
స్థానిక ప్రజల సమాచారం మేరకు.. పోలీసుల ఎస్ఓజా బృందం, ఆర్మీ, సీఆర్పీఎఫ్ సిబ్బంది చుర్ ప్రాంతానికి చేరుకున్నారు. అడవిలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తుల కదలికలను చూసినట్లు ప్రజలు చెప్పారు. వారి వద్ద ఆయుధాలు కూడా ఉన్నాయని వారు తెలిపారు.
ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం ఆధారంగా భద్రతా దళాల సంయుక్త బృందం అడవిలోకి ప్రవేశించింది. ఉగ్రవాదులను పట్టుకునేందుకు సైనికులు, పోలీసులు వెతుకుతున్నారు. భద్రతా దళాలను చూడగానే ఉగ్రవాదులు కాల్పులు జరుపడం ప్రారంభించారు. ప్రస్తుతం రెండు వైపులా కాల్పులు ఉధృతంగా కొనసాగుతున్నాయి.
ఆర్మీ బలోపేతం వెనుక జనరల్ మానెక్షా అవిరళ కృషి.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..