చైనాతో యుద్ధంలో కొంత విచారానికి గురైన భారతదేశం ఆర్మీలో జవసత్వాలు నింపి మరో యుద్ధానికి సిద్ధం చేశారు జనరల్ మానెక్షా. మానెక్షా పూర్తిపేరు సామ్ హర్ముస్జీ జమ్షెడ్జీ మానెక్షా. 1971 యుద్ధంలో పాక్ ఆర్మీకి చుక్కలు చూపించడంలో మానెక్షా తెగువ మరువరానిది.
ఆయన చూపిన తెగువ కారణంగానే 13 రోజుల్లోనే యుద్ధం ముగిసి పాకిస్తాన్కు చెందిన దాదాపు 90 వేల మంది సైనికులు భారతదేశానికి లొంగిపోయారు. ఈ యుద్ధం తరువాతనే పాకిస్తాన్ రెండుగా విడిపోయి.. కొత్తగా బంగ్లాదేశ్ ఏర్పాటైంది. ఇండియన్ ఆర్మీలో ఫీల్డ్ మార్షల్ పదవిని అలంకరించిన తొలి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు. ఇంత గొప్ప సైనికుడు 1913 లో సరిగ్గా ఇదే రోజున పంజాబ్లోని అమృత్సర్లో జన్మించారు.
మానెక్షా తండ్రి హోర్మిజ్ద్ మానెక్షా పెద్ద వైద్యుడుగా పేరు తెచ్చుకున్నారు. తండ్రిలాగే తాను కూడా వైద్యుడిగా స్థిరపడాలని వైద్యవిద్యనభ్యసించేందుకు మానెక్షా ఇంగ్లండ్ వెళ్లారు. అయితే, భారత సైన్యంలో చేరాలన్న తండ్రి కోరిక మేరకు ఇండియాకు తిరిగి వచ్చిన మానెక్షా.. డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో 1932 లో చేరారు.
నాలుగో బెటాలియన్లో విధులు నిర్వర్తించడంతో ప్రారంభమైన ఆయన సేవలు భారత సైన్యంలో దశదిశలా వ్యాపించాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మిలిటరీ క్రాస్ గ్యాలంట్రీ అవార్డు పొందారు. భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత గోర్ఖా రెజిమెంట్కు బదిలీ అయ్యారు. పాకిస్తాన్తో యుద్ధానికి దిగి వారిని ఇప్పటికీ కోలుకోనీయకుండా చేయగలిగారు.
జనరల్ మానెక్షా అందించిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆయనకు 1972 లో పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. సైన్యం నుంచి పదవీ విరమణ పొందిన అనంతరం వెల్లింగ్టన్లో స్థిరపడిన మానెక్షా.. 2008 లో 94 ఏండ్ల వయసులో అక్కడే కన్నుమూశారు.
2016 : కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఇంగ్లండ్ను ఓడించి ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ను గెలుచుకున్న వెస్టిండీస్
2010 : మొదటి ఐప్యాడ్ను మార్కెట్లోకి విడుదల చేసిన ఆపిల్
1999 : మొట్టమొదటి ప్రపంచ టెలికమ్యూనికేషన్ ఉపగ్రహం ఇన్శాట్ 1ఈ ని ప్రయోగించిన భారత్
1973 : మాన్హటన్ నుండి వచ్చిన మొదటి పబ్లిక్ మొబైల్ టెలిఫోన్ కాల్
1942 : రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికాకు వ్యతిరేకంగా చివరి రౌండ్ సైనిక చర్యలను ప్రారంభించిన జపాన్
1922 : సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన జోసెఫ్ స్టాలిన్
1680 : మరాఠా సామ్రాజ్యానికి పునాది వేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ రాయ్గఢ్లో మరణం
1325 : చిస్తి శాఖ నాలుగో సాధువు నిజాముద్దీన్ ఆలియా మరణం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..