న్యూయార్క్: లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని మోదీకి అమెరికా టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్(Elon Musk) కంగ్రాట్స్ తెలిపారు. ఇండియాలో తమ కంపెనీలు పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల్లో విజయం సాధించిన మోదీకి కంగ్రాట్స్ చెబుతున్నట్లు మస్క్ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు. మోదీ మూడవ సారి ప్రధానిగా జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
టెస్లా కంపెనీ సీఈవో మస్క్ ఇటీవల ఇండియా టూర్ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల మస్క్ ఆ ట్రిప్ రద్దు చేసుకున్నారు. అయితే రెండు నెలల బ్రేక్ తర్వాత ఇప్పుడు మోదీకి విషెస్ చెబుతూ మస్క్ పోస్టు పెట్టారు. ఏప్రిల్ 21, 22 తేదీల్లో ప్రధాని మోదీని కలవాల్సిన మస్క్.. ఆ పర్యటనను రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది మళ్లీ ఇండియాకు రానున్నట్లు అప్పుడు చెప్పారు.
గత ఏడాది జూన్లో మోదీ అమెరికా వెళ్లిన సమయంలో అక్కడ మస్క్ను కలిశారు. 2024లో ఇండియాకు రానున్నట్లు ఆయన చెప్పారు. భారతీయ మార్కెట్లోకి టెస్లా ఎంటర్ అవుతుందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అయితే మస్క్ రానున్న నేపథ్యంలో టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ గురించి ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపించాయి. స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ వ్యాపారాన్ని కూడా విస్తరించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.
Congratulations @narendramodi on your victory in the world’s largest democratic elections! Looking forward to my companies doing exciting work in India.
— Elon Musk (@elonmusk) June 7, 2024