శాన్ఫ్రాన్సిస్కో, ఏప్రిల్ 16: ప్రముఖ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ కొత్త యూజర్లకు షాక్ ఇచ్చింది. ఫేక్ ఖాతాలు, స్పామ్ను అడ్డుకునే ప్రయత్నం పేరుతో కొత్త ఖాతాదార్లకు వార్షిక ఫీజు విధించబోతున్నట్టు ‘ఎక్స్’ కంపెనీ (ఎక్స్ కార్ప్) నుంచి మంగళవారం ప్రకటన వెలువడింది. కొత్త ఖాతాలకు ప్రతి ఏటా కొద్ది మొత్తంలో ‘వార్షిక ఫీజు’ వసూలు చేయబోతున్నట్టు కంపెనీ తెలిపింది.
కొద్ది మొత్తాన్ని ఫీజుగా చెల్లించాకే.. కొత్త యూజర్లు ‘ఎక్స్’లో పోస్ట్, లైక్, బుక్మార్క్, ప్రత్యుత్తరం ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం న్యూజిలాండ్లో ఈ విధానాన్ని ‘ఎక్స్’ అమలుజేస్తున్నది. ఇక్కడ కొత్త యూజర్ల నుంచి వార్షిక ఫీజుగా ఒక అమెరికా డాలర్ను వసూలు చేస్తున్నది. ‘స్పామ్ ఖాతాలను తగ్గించడానికి, ప్రతి వినియోగదారుకు మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగపడుతుంది’ అని కంపెనీ వెబ్సైట్ పేర్కొన్నది.