Election Campaign | స్మార్ట్ఫోన్ల యుగంలో ప్రచారం కొత్త పుంతలు తొక్కుతున్నది. ఇంటింటి ప్రచారం కాస్త స్మార్ట్గా మారింది. నామినేషన్లకు సమయం ముంచుకొస్తుండటంతో తక్కువ సమయంలోనే ఎక్కువ మంది ఓటర్లను చేరుకునేలా వివిధ పార్టీల అభ్యర్థులు ప్లాన్ చేస్తున్నారు. నేరుగా ఓటర్లకు ఫోన్లు చేయిస్తున్నారు. అందుకోసం కాల్సెంటర్లను నియమించుకుంటున్నారు. ఓటర్లకు ఫోన్లు చేసి అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు పలు కాల్ సెంటర్లు రంగంలోకి దిగాయి.
కాల్సెంటర్ల నిర్వాహకులు అధికార, ప్రతిపక్షాల అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. ఓటర్లకు ఫోన్లు చేసి ‘మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉన్నది? స్థానిక సమస్యలను పరిష్కరించడంలో ఎవరు ముందుంటారు? ప్రస్తుత ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉన్నది? ఈసారి మీ ఓటు ఎవరికి?’ అంటూ అడుగుతున్నారు. పనిలోపనిగా సంక్షేమ పథకాలను వివరించి సదరు అభ్యర్థికే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈ మేరకు అభ్యర్థులు, కాల్సెంటర్ల మధ్య ఒప్పందాలు కూడా జరుగుతున్నాయి. పలు ఏజెన్సీలు ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నాయి.
యువతకు ఉపాధి మార్గంసమగ్ర సమాచారంతో రంగంలోకి దిగుతున్న కాల్సెంటర్లు అభ్యర్థి వివరాలు, పార్టీ అమలు చేసే పథకాలను ఓటర్లకు వివరిస్తున్నాయి. అందుకోసం నియోజకవర్గ పరిధిలో క్యాంపులను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ సర్వీసుల వల్ల స్థానికులకు ఉపాధి లభిస్తున్నది. హిందీ, ఇంగ్లిష్, తెలుగు మాట్లాడే మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులను తాత్కాలిక ప్రాతిపదికన ఏజెన్సీలు నియమించుకుంటున్నాయి. ఇంగ్లిష్ వచ్చిన వారికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. రోజు లెక్కన, కాల్స్ వారీగా జీతభత్యాలను అందిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లోని తార్నాకలో ఉన్న ఓ కాల్సెంటర్ నిర్వాహకులు ఓయూ విద్యార్థులను పార్ట్ టైం విధానంలో నియమించుకున్నారు. ఒక్కో కాల్సెంటర్ అవసరాన్ని బట్టి 50-100 మందిని నియమించుకుంటున్నా యి. రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. నామినేషన్ల పర్వం మొదలయ్యే నాటికి కాల్సెంటర్ల ప్రచార పర్వం జోరందుకునే అవకాశం ఉన్నది.
… కడార్ల కిరణ్