న్యూఢిల్లీ/ లక్నో, మార్చి 6: ఈ నెల 10న వెలువడనున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆయా రాష్ర్టాల్లో ముఖ్యమంత్రులను నిర్ణయించడమే గాక, ఈ ఏడాది ఆఖరులో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ప్రభావం చూపనున్నాయి. రాష్ట్రపతి కోవింద్ పదవీ కాలం ఈ ఏడాది జూలై 24తో ముగియనున్నది. ఎలక్టోరల్ కాలేజ్ విలువ ఆధారంగా నిర్వహించనున్న రాష్ట్రపతి ఎన్నికలకు.. వివిధ లెక్కల ప్రకారం ప్రస్తుతానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి బలం 50 శాతానికి తక్కువగా ఉన్నది. తమ అభ్యర్థిని ఇబ్బంది లేకుండా గెలిపించుకోవాలంటే ఇతర పార్టీలపై ఆధారపడాలి.
దేశంలోనే అధిక జనాభా కలిగిన యూపీలో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 208. అంటే యూపీ లో 403 మంది ఎమ్మెల్యేల ఓట్ల విలువ 83,824. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఎదురైతే నంబర్ గేమ్ మారుతుంది. అటువంటి సమయంలో ఏ కూటమిలో లేని గణనీయంగా ఓట్ల విలువ కలిగివున్న టీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ వంటి పార్టీలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నది. ఎలక్టోరల్ కాలేజ్లో 233 మంది రాజ్యసభ, 543 మంది లోక్సభ సభ్యులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 4,120 మంది ఎమ్మెల్యేలు ఉంటారు.
నేడే యూపీ చివరి విడత ఎన్నికలు
ఉత్తరప్రదేశ్లో చివరి విడత ఎన్నికలు సోమవారం జరుగనున్నాయి. ప్రధాని మోదీ ఇలాకా వారణాసి సహా 54 స్థానాలకు పోలింగ్ జరుగనున్నది. ఈ ఎన్నికలు 613 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నాయి. అజాంగఢ్, మావ్, జౌన్పూర్, ఘాజీపూర్, చందౌలీ, వారణాసి, మీర్జాపూర్, భదోహి, సోన్భద్ర జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. యూపీతో సహా ఎన్నికలు జరిగిన పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఫలితాలు 10న వెలువడనున్నాయి.