ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 26: ఉస్మానియా యూనివర్సిటీ మరొక ఘనమైన వేడుకకు వేదిక కానుంది. 24వ కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ (సీఈసీ) – యూజీసీ ఎడ్యుకేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ను ఓయూలో గురువారం నుంచి నిర్వహించనున్నారు. ఈ ఫెస్టివల్ మూడు రోజుల పాటు జరుగనుంది. ఓయూ పరిపాలనా భవనంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఈసీ డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్ భూషణ్ నడ్డా ఫెస్టివల్ వివరాలు వెల్లడించారు. నూతన విద్యావిధానం లక్ష్యాలను అధిగమించేందుకు డిజిటల్ విద్యావిధానం ఒక్కటే మార్గమని చెప్పారు. ఠాగూర్ ఆడిటోరియంలో జరుగనున్న ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలుగు సినిమా దర్శకుడు, ఓయూ పూర్వ విద్యార్థి శేఖర్ కమ్ముల హాజరవుతారని చెప్పారు. ప్రారంభోత్సవం అనంతరం డాక్యుమెంటరీల ప్రదర్శనను పీజీఆర్ఆర్సీడీఈ ఆడిటోరియంలో నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, సీఈసీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ మెహ్రా, ఓయూ యూజీసీ డీన్ ప్రొఫెసర్ మల్లేశం, ఈఎంఆర్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ మృణాళిని, ప్రొఫెసర్ ప్యాట్రిక్, రఘుపతి పాల్గొన్నారు.
కొనసాగుతున్న టెక్నోస్మానియా
ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహిస్తున్న టెక్నోస్మానియా 2023 వేడుకలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం పలు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజంటేషన్, ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్, టెక్నికల్ క్విజ్ తదితర పోటీలు జరిగాయి. వివిధ అంశాలపై శ్రీవెంకట శివపార్వతి స్పిన్నింగ్ మిల్స్ వైస్ ప్రెసిడెంట్ సుధాకర్, గుడ్రిచ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ టెక్నికల్ అండ్ మేనేజ్మెంట్ అడ్వైజర్ సూర్య వారణాసి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సాయిలు, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ హయవదన, కెమికల్ ఇంజినీరింగ్ విభాగం హెడ్ ప్రొఫెసర్ రమేశ్కుమార్, ఫుడ్ టెక్నాలజీ విభాగం హెడ్ ప్రొఫెసర్ వీవీ బసవరావు, కో కన్వీనర్ డాక్టర్ పరశురామ్, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు, స్టూడెంట్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.