హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాజేంద్రనగర్లోని గౌలిదొడ్డి గురుకుల విద్యాకేంద్రంలో ఐఐటీ, నీట్లో లాంగ్టర్మ్ ఉచిత శిక్షణకు ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యార్థులు ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని గురుకుల విద్యాలయాల సంస్థ వెల్లడించింది. విద్యార్థులు telangana.gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా నింపి ఆర్సీవో కార్యాలయంలో సమర్పించాలని సూచించింది.
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువును ఈ నెల 27 వరకు పొడిగించినట్టు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి సోమవారం వెల్లడించారు. సివిల్స్కు ప్రిపేరయ్యే బీసీ యువతకు ఉచిత శిక్షణతోపాటు స్టడీ మెటీరియల్ అందిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, త్వరలోనే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని, వివరాలకు 040-24071178 ఫోన్నంబర్లో సంప్రదించాలని సూచించారు.
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును ఈ నెల 30 వరకు పొడిగించారు. ఇదే తుది గడువని, మరోసారి పెంచే అవకాశమే లేదని ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ స్పష్టంచేశారు. గడువులోగా అడ్మిషన్లు పూర్తిచేయాలని సోమవారం ఆదేశించారు. రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరానికి 1,586 ప్రైవేట్ కాలేజీలు ఇంటర్బోర్డు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా.. 1,269 కాలేజీలు గుర్తింపు పొందాయి. 317 కాలేజీలు అనుమతులు పొందలేదు. ఈ 317 కాలేజీలు మిక్స్డ్ ఆక్యుపెన్సీ (ఒకే భవనంలో కాలేజీలు, వాణిజ్యసంస్థలు)తోపాటు షిఫ్టింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీటిల్ల్లో 10 వేల మంది వరకు విద్యార్థులు చేరారు. వీటికి ఇంటర్బోర్డు గుర్తింపు లేకపోవడం, అడ్మిషన్స్ వెబ్సైట్ను అధికారులు నిలిపివేయడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పుడు అడ్మిషన్స్ గడువును పెంచి వెబ్సైట్ను తిరిగి తెరవడంతో వీరికి ఉపశమనం లభించే అవకాశాలున్నాయి.
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): నీట్లో ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించేందుకు తనకు సహాయపడిన ఆకాశ్ ఇన్స్టిట్యూట్కు హైదరాబాద్ విద్యార్థి మృణాల్ కుట్టేరి కృతజ్ఞతలు తెలిపారు. నీట్ యూజీ 2021 పరీక్షలో 720 మార్కులతో ఫస్ట్ర్యాంకు సాధించిన మృణాల్ను హైదరాబాద్లో ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీస్ లిమిటెడ్ సౌత్జోన్ ప్రాంతీయ డైరెక్టర్ ధీరజ్కుమార్ మిశ్రా, డిప్యూటీ డైరెక్టర్ కే శేషగిరిరాజు, తెలంగాణ, ఏపీ రీజనల్ హెడ్ ఎం భరత్కుమార్ తదితరులు సత్కరించారు. నీట్లో మొదటి ర్యాంకు రావడానికి ఎస్సీఈఆర్టీ పుస్తకాలు, ఆకాశ్ స్టడీ మెటీరియల్ దోహదపడ్డాయని మృణాల్ తెలిపారు. ఈ మేరకు ఆకాశ్ సంస్థ సోమవారం ఒక ప్రకటన విడుదలచేసింది.