2001, ఏప్రిల్ 27
‘ఎవుసాలు బందువెట్టి రామరామ ఎల్లిపోయె కాలమొచ్చె దేవదేవ ఏడాదికి ఒక్కసారి రామరామ యెట్ల కడుదుమయ్య మేము దేవదేవ సంస్కరణ పేరుతోని రామరామ చావగొట్టి చెవులు మూసె దేవదేవ..’
‘విద్యుత్ సంస్కరణల’ పేరుతో తెలంగాణ రైతుల కడుపు కొట్టిన అప్పటి పాలనా విధానాలపై తిరుగుబాటు చేసిన నాటి డిప్యూటీ స్పీకర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన రోజు జరిగిన సభలో వినపడిన గేయంలోని పాదాలు అవి. తెలంగాణ గాయాలకు ఆవేశంగా విచ్చుకున్న పెదాలు అవి.
ఆ తర్వాత జరిగిన మహత్తర ఉద్యమం,మహోజ్వల ఘట్టాలు, స్వరాష్ట్ర సాధన, కేసీఆర్ సుపరిపాలన చదువరుల అనుభవంలోనిదే.
కట్ చేస్తే.. 2020, సెప్టెంబర్ 15
కేంద్ర బీజేపీ ప్రభుత్వ డ్రకోనియన్ ‘విద్యుత్ సంస్కరణల సవరణ బిల్లు-2003’ను వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భం. రైతుల కేంద్రంగా, గ్రామీణ ఆర్థికవ్యవస్థ పటిష్ఠత లక్ష్యంగా సాగిన నాటి ప్రసంగంలో కేసీఆర్ ఏమన్నారంటే…
దేశాన్ని పరిపాలించే విషయంలో ఆదేశిక సూత్రాలను ఉల్లంఘిస్తున్నది బీజేపీ. రాజ్యాంగాన్ని విచ్చలవిడిగా వాడుకున్నారు. అన్నింటినీ కేంద్రీకృతం చేసి రాష్ర్టాలను ప్రమాదంలోకి నెడుతున్నారు.
దేశంలో 70 వేల టీఎంసీల నీళ్లున్నా చెన్నై నగరం బకెట్ నీళ్ల కోసం తపిస్తున్నది. 75 శాతం పైచిలుకు దేశం మంచినీటి కోసం ఎందుకు అల్లాడుతున్నది?
సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం దేశంలో మొత్తంగా ఉన్నదే 40 కోట్ల ఎకరాల సాగు భూమి. ఇందుకుగాను 40 వేల టీఎంసీలు వాడినా, 10 వేల టీఎంసీలు తాగునీటి కోసం, పారిశ్రామిక అవసరాల కోసం వాడినా ఇంకా 20 వేల టీఎంసీలు ఉంటాయి. వంద-రెండొందల ఏండ్ల వరకు మనం రంది పడనక్కరలేనంత పుష్కలమైన ప్రకృతి సంపద ఉన్నది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 28 వేల టీఎంసీలు వాడకం దాటలేదు.
దేశం మొత్తంలో స్థాపిత విద్యుత్ 4 లక్షల మెగావాట్లు. కానీ 2 లక్షల మెగావాట్లు మాత్రమే వాడుతున్నాం. విద్యుత్ సంస్థల ఉసురు తీయడం వల్ల అవి నడవలేక, వాటిని నడపలేక బ్యాక్డౌన్ అవుతున్నాయి. ఇంకో 2 లక్షల మెగావాట్లు ఉత్పత్తికి సిద్ధంగా ఉండి కూడా కేంద్ర ప్రోత్సాహం లేక మూలన పడి ఉన్నవి. వాటిని దేశ ప్రగతికి ఎట్లా వాడుదాం, అవసరమైతే లక్ష కోట్లు ఇచ్చి వ్యవసాయ, పారిశ్రామిక ప్రగతిని దేశవ్యాప్తంగా ఎట్లా చేద్దామనే ధ్యాస లేదు కేంద్ర ప్రభుత్వానికి.
ఆదుకోవాల్సింది పోయి ఆడుకుంటున్నారు మన విద్యుత్ సంస్థలతో. విద్యుత్ సంస్కరణలు అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టిన్రు. రాష్ర్టాల ప్రతిపత్తిని, సమాఖ్యస్ఫూర్తిని గొడ్డలితో అడ్డంగా నరికే చట్టాలివి. ఈ రాష్ట్రంలోని 26 లక్షల మోటార్లకు మీటర్లు పెట్టాలంటున్నది కేంద్రం. ఒప్పుకొంటారా బీజేపీ ఎంపీలు? బీజేపీయేతర రాష్ర్టాలు అన్నీ వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఈ బిల్లును. బాయి కాడ మీటర్లు పెట్టండి అంటున్నారు. నన్ను చంపినా మీటర్లు పెట్టను.
పాఠక మిత్రులారా, ఎడిట్పేజీ వ్యాసాలు చదివే ఆలోచనాపరులారా!
పై పేరాలోని ‘బాయికాడ మీటర్లు నన్ను చంపినా పెట్టను’ అనే బుల్లెట్ లాంటి మాట చదివితే మీకు మననంలోకీ గమనంలోకీ రాలేదా- ఈ మాట 21 ఏండ్ల కింద టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభలో అన్నరు కేసీఆర్. ఏడాదిన్నర కింద రాష్ట్ర అసెంబ్లీలో మళ్లా అన్నరు. మొన్న జనగామ సభలో అన్నరు. ఒకటే మాట… రైతు, పేదల నడ్డివిరిచే ‘విద్యుత్ సంస్కరణల’పై కేసీఆర్ తిరుగుబాట! రెండు దశాబ్దాల కిందటి ఆ మాట తూటాలా పేలి సమైక్య పాలకులను తరిమేసింది. సొంత రాష్ట్రం సాధించడానికి కారణమైంది. మళ్లా ఇపుడు ఈ దేశ దశ-దిశ మార్చేలా నాటి తూటా నేడు వజ్రాయుధంలా మారుతున్నది. ఈసారి లక్ష్యం ఢిల్లీనే!
నాడైనా, నేడైనా ఆయన ఆవేదన ఎందుకంటే ఇట్లాంటి అమానవీయ చట్టాలు, విధానాల కారణంగా విపత్కర పరిణామాలు ఏర్పడుతాయి. మన విద్యుత్ సంస్థలు మూతపడుతాయి. ఇండియాలో ఉన్న మొత్తం ఉద్యోగులు, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు రోడ్డున పడతాయి. తెలంగాణ వచ్చినంక 22 వేల మంది ఆర్టిసన్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసుకున్నం, ఇప్పటికే ఉన్న రెగ్యులర్ ఉద్యోగులకు తోడుగా. వారంతా ఇప్పుడు నష్టపోతారు. బతుకులు ఆగమైతాయి. ‘విద్యుత్ చట్ట సవరణల బిల్లు’ ద్వారా విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే దుర్మార్గం బీజేపీది. పంపుసెట్ల దగ్గర మీటర్లు పెట్టడం దగ్గరి నుంచి, రాష్ర్టాల పరిధిలో విద్యుత్ నిర్వహణ మొత్తం తన గుప్పిట్లో పెట్టుకుంటున్నది కేంద్రం. రాష్ర్టాల అధికారాలను హరించే, సమాఖ్యస్ఫూర్తికి గొడ్డలిపెట్టు అయిన ఈ విధానాలు సాగనివ్వకూడదు.
గతంలో ఇట్లాంటి చొరబాట్లు చాలానే చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి పరీక్షలను ఏకీకృతం చేసింది. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల వరకే పరిమితమైన బీఎస్ఎఫ్ దళాల పరిధిని 50 కిలోమీటర్ల మేర విస్తరించింది. ఓడ రేవులపై రాష్ర్టాల అధికారాన్ని కూడా కబళించ చూస్తున్నారు. ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆగడాలకు అడ్డుకట్ట పడాలి. బలమైన ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా దక్షిణ భారతదేశ రాజకీయపార్టీలు ఈ బాధ్యత తీసుకోవాలి. కేంద్ర-రాష్ర్టాల వద్ద ఉండే రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితాలోని రంగాల పట్ల క్లారిటీ కావాలి. వ్యవసాయాన్ని కేంద్రం దిక్కులేని దశకు తీసుకువస్తున్నది. రాష్ట్ర జాబితాలోనిదే అయినా అన్ని నియంత్రణలు కేంద్రానివే. ఇది మారాలి. రిజర్వేషన్లు రాష్ర్టాల పరిస్థితులకు, అవసరాలకు అనుగుణంగా మార్చుకునే హక్కు రాష్ర్టాలకు ఉండాలి. పన్నుల వాటా ప్రాతిపదికగా రాష్ర్టాలకు నిధులుండాలి. ధనిక రాష్ట్రమని మన వాటాకు కోత పెట్టడం ఆగాలి.
‘మనం భారత పార్లమెంట్ను రద్దు చేద్దాం. అదింకా ఖరీదైన చీదర తప్ప ఏం కాదు. అన్ని బిల్లులను కేవలం బీజేపీ పార్లమెంట్ సభ్యులే కూచుని పాస్ చేస్తారు, ఇది దారుణం’ అన్నారు కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు యశ్వంత్ సిన్హా. ‘కుక్కకు ఇచ్చే విలువ కూడా రైతులకు బీజేపీ ఇవ్వడం లేదని’ మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. ఆర్ఎస్ఎస్ సహా బీజేపీలోని కొందరు ఆలోచనాపరుల ఆవేదన అది. అయితే, సొంత శిబిరంలోని వారినే ఏ మాత్రమూ లక్ష్యపెట్టని నరేంద్ర మోదీ దృష్టిలో ఇక దేశ రైతాంగానికి, ప్రజలకు ఏం విలువ ఉంటుంది?
సరిగ్గా ఆ విలువల లేమినే మనం ఇప్పుడు ప్రశ్నించాలి.
ఈ దేశం ఎవనబ్బ సొత్తు కాదు, గుత్త కాదు. మతపిచ్చి తప్ప జ్ఞానమూ, అధ్యయనమూ, అభ్యాసమూ లేని బీజేపీ వారు తెలుసుకోవాలి ఈ దేశం గురించి. ముఖ్యంగా సౌత్ ఇండియా గురించి. భారత ద్వీపకల్పంలో వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్న మన ఐదు రాష్ర్టాలకు ఉత్తరాన నర్మదా నది, మహానది పడమటన అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, కావేరి మన ప్రాంతాలను సస్యశ్యామలం చేసే జీవనదులు. ఈ జనపు జీవనాడులు!
కాకతీయులు, శాతవాహనులు, ఆంధ్ర ఇక్ష్వాకులు, చోళులు, పాండ్యులు, చేరులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, హోయసల, విజయనగర రాజులు పరిపాలించిన మన దక్కన్ నేల విద్యారంగంలో ముందుండటం వల్ల అత్యధిక తలసరి ఆదాయం ఉన్నది. ద్రావిడ భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మాట్లాడే మినీ ఇండియా అయిన మనం మొత్తం దేశానికే దిశానిర్దేశం చేయగలం. ‘ప్రజలను ఆర్గనైజ్ చేస్తం. డెమోక్రటిక్గా కొట్లాడుతం. మేమేమీ ఆగమాగం అయితలేం, తెల్లారేసరికల్లా ఏదో అయిపోవాలనే స్వార్థమూ, తొందరా లేదు మాకు’ ఇది నాడు రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ ప్రకటిత సంకల్పం, కార్యాచరణ ప్రణాళిక.
ఇప్పుడూ అదే మాట. అయితే, కాన్వాస్ మారింది. లక్ష్యం విశాలమైంది. దేశ సమగ్రత, సుభిక్షత కోసం యువతను జాగృతం చేస్తామన్నరు మొన్న. Educate-Organise అని మన బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చూపిన మార్గంలోనే కదులుతున్నారు. మొన్న జనగామలో, నిన్న భువనగిరిలో అడిగిన్రు మద్దతు ఇస్తారా నాకు, కొట్లాడమంటారా ఢిల్లీపై. జాతీయ రాజకీయాల్లో పాత్ర వహిద్దామా? దేశాన్ని కొత్తగా నిర్మిద్దామా అని అడిగిన్రు. సభికులెల్లరు హర్షధ్వానాలు చేస్తూండగా! ఒక్క జనగామ, భువనగిరి మాత్రమే కాదు… యావత్ రాష్ట్రం, సౌత్ ఇండియా సహా దేశమంతా కేంద్రీకృత దాష్టీకంపై యుద్ధానికి సై అంటున్నది. మన అంబేద్కర్కు అమెరికన్ ఫిలాసఫర్ మాథ్యూ ఆర్నాల్డ్ అంటే గురి.
వాండరింగ్ బిట్వీన్ టూ వరల్డ్స్ ఒన్ డెడ్ అండ్ ది అదర్ పవర్ లెస్ టు బి బార్న్ అని అంటారు మాథ్యూ ఆర్నాల్డ్. రెండు ప్రపంచాల నడుమ పరిభ్రమణం-ఒకటి అస్తమించినది-ఇంకొకటి ఉదయించే శక్తి లేనిది-అని అర్థం.
ఈ దేశానికి నవీన ఆలోచనలు, ఆధునిక దృష్టి కావాలని ఆకాంక్షిస్తూ ఆర్నాల్డ్ మాటల్ని ఉటంకిస్తారు అంబేద్కర్. నేడు ఆ అవసరం ఇంకా ఎక్కువ ఉన్నది. కేసీఆర్ పిలుపు ఇచ్చినట్టు- మృతప్రాయమైన గత విలువలస్థానే కొత్త శక్తి ఉదయించాలి. అందుకు యువత నడుం కట్టాలి. వాట్సాప్ యూనివర్శిటీల క్షుద్ర విద్యల నుంచి విముక్తం కావాలి. ఫూలే కాంక్షించిన సత్యశోధన కావాలిపుడు. అందుకు లోతైన అధ్యయనం జరగాలి. ఆర్గనైజ్ కావాలి. యాజిటేట్ చేయాలి.
కేంద్రీకృత దాష్టీకాన్ని బలంగా నిరసించే గొంతుకల్లో, నిలువరించే శక్తులలో, ఆటకట్టించగల యుక్తులలో ప్రధానం కేసీఆర్. ఆయనకు దన్నుగా నిలవడమే మనందరి కర్తవ్యం. ఇది ఒక నాయకుడి కో, ఒక పార్టీకో, ఒక ప్రాంతానికో సంబంధించిన వ్యవహారం కాదు. పాతాళ కుహరంలోకి జెట్ స్పీడుతో పడిపోతున్న దేశా న్ని రాకెట్ వేగంతో హిమశైల శిఖర సమా నం చేయాలిప్పుడు. జై భారత్.
దేశ సమగ్రత, సుభిక్షిత కోసం యువతను జాగృతం చేస్తామన్నరు మొన్న. Educate-Organise అని మన బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చూపిన మార్గంలోనే కదులుతున్నారు. మొన్న జనగామలో, నిన్న భువనగిరిలో అడిగిన్రు మద్దతు ఇస్తారా నాకు, కొట్లాడమంటారా ఢిల్లీపై. జాతీయ రాజకీయాల్లో పాత్ర వహిద్దామా? దేశాన్ని కొత్తగా నిర్మిద్దామా అని అడిగిన్రు. సభికులెల్లరు హర్షధ్వానాలు చేస్తూండగా! ఒక్క జనగామ, భువనగిరి మాత్రమే కాదు… యావత్ రాష్ట్రం,సౌత్ ఇండియా సహా దేశమంతా కేంద్రీకృత దాష్టీకంపై యుద్ధానికి సై అంటున్నది.
శ్రీశైల్రెడ్డి పంజుగుల
9030997371