ప్రపంచంలో ఏ దేశానికి లేని ప్రత్యేకత భారత్కు ఉన్నది. యోగులకు, మహనీయులకు ఆలవాలమైంది. దేశంలో ఎంతోమంది యోగులు, సిద్ధులు, కాలజ్ఞానులు లోక కల్యాణం కోసం ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టారు. ధర్మబోధ చేశారు. ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను పోగొట్టడానికి కృషిచేశారు. ప్రజలను సన్మార్గం వైపు నడిపించారు. ఇలాంటివారిలో ఎంతోమంది మహిళలు ఉండటం విశేషం. అలాంటి మహిళా యోగినుల చరిత్రను వెలుగులోకి తెచ్చిన మహిళ బిరుదురాజు రుక్మిణి.
రుక్మిణి స్వయంగా తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాలు తిరిగి యోగినుల సమాధులను దర్శించారు. భక్తుల నుంచి, ఆయా ఆశ్రమ కమిటీ నిర్వాహకుల నుంచి మౌఖిక, ముద్రిత సమాచారాన్ని సేకరించి ‘ఆంధ్ర యోగినులు’ అనే గ్రంథాన్ని వెలువరించారు. దీనిలో 27 మంది యోగినుల చరిత్రను పొందుపరిచారు. యోగినులు తమ జీవితాచరణ, బోధనలతో ప్రజలకు ఉపయోగపడిన విధానాన్ని, వారు అనుసరించిన మార్గాలను వెలుగులోకి తెచ్చారు.
మన చరిత్రలో చూస్తే ఎందరో మహిళామణులు సమాజ బాగుకోసం తాపత్రయపడుతూ బోధనలు, సాహిత్యం ద్వారా కృషిచేశారు. అణచివేత, వివక్షలను రూపుమాపడానికి శక్తులను ధారపోశారు. ఈ క్రమంలో యోగులకు వచ్చినంత పేరు, గుర్తింపు యోగినులకు దక్కలేదు. ఎంతోమంది మహిళలు మరుగున పడిపోయారు. ఎంతో త్యాగపూరితంగా జీవించిన ఆచార్య బిరుదురాజు రుక్మిణి కూడా ఒక ఆధునిక యోగిని అని చెప్పవచ్చు.
ఈ గ్రంథంలో మూడువర్గాల యోగినులు కనిపిస్తారు. మొదటివర్గం వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిణులుగా ఉండి సాధనతో సిద్ధి పొందినవారు. వారిలో వీరబ్రహ్మేంద్రుల మనవరాలైన ఈశ్వరమ్మతో పాటు, మూటలమ్మ, గయాబాయి, శబరిమాత, శివబాల యోగీశ్వరీ దేవీల చరిత్రలున్నాయి. రెండోవర్గం వివాహమైన కొద్దికాలానికే వైధవ్యం ప్రాప్తించగా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నవారి ప్రస్తావన ఉంది. వారిలో తరిగొండ వెంగమాంబ, సూక్ష్మ మూర్తెమ్మ, మాణిక్యనగరం వెంక మ్మ, గుత్తికొండ బిలం పేరమ్మ, సరస్వతి లక్ష్మమ్మ, సూరి నాగమ్మ, పెనుమత్స సీతమ్మల చరిత్రలున్నాయి. మూడవ వర్గం గృహస్థాశ్రమం స్వీకరించి, ఆ తర్వాత ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించినవారు. వీరిలో బందరు దొంతులమ్మ, తిక్క లక్ష్మమ్మ, కోసల నగరం రామక్కమ్మ, కురుమద్దాలి మాలపిచ్చమ్మ, రేపల్లె చిన్నమ్మ, బెహరా కమలమ్మ, గోవాడ శేషమ్మ, చివటం అచ్చమ్మ, రాజమహేంద్రవరం దేవుడమ్మ, గుట్టూరుకోన అంజనాదేవి, జిల్లెళ్ళమూడి అనసూయమ్మ, కృష్ణప్రియల చరిత్రలున్నాయి.
యోగినులలో చాలామంది ఆధ్యాత్మిక, సాహిత్య సంపదను అందించారు. రచయిత్రి బిరుదురాజు రుక్మిణి కూడా ఆధునిక యోగినిలా జీవించి, ఎంతోమందికి తన వంతు సాయం అందించి మానవిగా తన జీవితాన్ని కొనసాగించారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, పరిశోధించి, పరిశ్రమించి ఆధ్యాత్మిక సాహిత్యరంగానికి విలువైన సంపదగా ‘ఆంధ్ర యోగినుల చరిత్ర’ను మనకందించారు. ఆ రంగంపై ఆమె చేసిన పరిశోధనలు వెలకట్టలేనివి.
డాక్టర్ మురాడి శ్యామల, 94918 20945