‘వలయ విచల ద్విహంగాలో, విలయ సాగర తరంగాలో, యుద్ధ గుంజన్మృదంగాలో.. కవీ నీ పాటల్’.. అంటూ మహాప్రస్థానంలో శ్రీశ్రీ స్విన్బర్గ్ అనే ఆంగ్ల కవి గురించి మహావేశంతో చెప్పా రు. నియంతృత్వానికి పర్యాయపదంగా, దేశ భవిష్యత్తుకు ప్రథమ ఆటంకంగా మారిన ఢిల్లీ పీఠంపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ మాటలు, ప్రెస్మీట్లు కూడా ప్రస్తుతం దేశవ్యాప్తంగా అటువంటి ప్రభావాన్నే చూపుతున్నాయి. లక్షలాది ఫాలోయర్లున్న ఫేస్బుక్ ఎకౌంట్లు కేసీఆర్ వీడియోలను వరుసగా పోస్ట్ చేస్తున్నాయి. ఇన్నేండ్లకు నరేంద్రమోదీకి సరైన ప్రత్యర్థి దొరికాడన్న సంతోషం, సంతృప్తి కనిపిస్తున్నది. దేశం గురించి, తమ పిల్లల భవిష్యత్తు గురించి నెలకొన్న భయం, ఆందోళన, ఆవేదన స్థానంలో ఆశ, అవగాహన, స్థైర్యం పెరుగుతున్నాయి. ఇదంతా కేవలం 17 రోజుల్లో కేసీఆర్ మాటలు సృష్టించిన ప్రకంపనలు.
ప్రజావ్యతిరేక, మత విద్వేష బీజేపీ విధానాలపై, మోదీ సర్కార్పై అసంతృప్తి ఇప్పటికే దేశమంతటా చాపకింద నీరులా వ్యాపించింది. చాయ్ వాలానంటూ, చాయ్ పే చర్చా అంటూ ఎన్నెన్నో కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన మోదీ హయాంలో గడిచిన ఎనిమిదేండ్లను చూస్తే ఏమున్నది గర్వకారణం అన్న నిరాశ, నిర్లిప్తత దేశాన్ని ఆవహించింది. మాటలు తప్ప పనికొచ్చే చేతలు లేవన్న వాస్తవం అర్థమైంది. మోదీ మీద పెట్టుకున్న భ్రమల నుంచి రైతులు, యువతీ యువకులు, ఉద్యోగులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. అవధులు లేని అబద్ధాలను, మతవిద్వేషాన్ని, కుసంస్కారాన్ని రంగరించి బీజేపీ రూపొందించిన సోషల్ మీడియా కర్మాగారం కూడా బీటలు వారుతున్నది. వాళ్లు ఒక్క పోస్టు పెడితే దానికి కౌంటర్గా పది పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. నిరాశను పారదోలి మోదీని ఎన్నికల సంగ్రామంలో మట్టికరిపించే మొనగాడి కోసం యావత్దేశం వెదుకుతున్న దశలో తెలంగాణ విముక్తి ప్రదాత, ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగారు.
‘ఈ దేశం ఎవ్వని అయ్య సొత్తు కాదు.. దేశం నాశనమవుతుంటే చూస్తూ ఊరుకునేదే లేదు. బీజేపీ దుర్మార్గ పాలన నుంచి దేశాన్ని రక్షించుకోవాలి. ఢిల్లీ పీఠాన్ని బద్దలు కొడదాం’ అన్న కేసీఆర్ పిలుపు మేధావులు, ప్రజలు, రాజకీయ నేతల్లో కొత్త ఆలోచనను రేకెత్తిస్తున్నది. లాలూ, దేవెగౌడ వంటి సీనియర్ నేతలు భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారు. మమత, ఉద్ధవ్ ఠాక్రే, స్టాలిన్ తదితర సీఎంలు భుజం భుజం కలిపి పోరాడుతాం.. రండి, మాట్లాడుకుందాం అంటూ ఆహ్వానం పలుకుతున్నారు. కేసీఆర్ వాగ్ధాటి, సమయస్ఫూర్తి, ధర్మాగ్రహం, అనేక అంశాలపై ఆయనకున్న విస్తృత అవగాహన, అరటిపండు ఒలిచి పెట్టినట్లు చెప్పే ఆయన సరళ శైలి నాయకుల్నే కాదు, జనాల్నీ మంత్రముగ్ధుల్ని చేస్తున్నది. సరికొత్త రాజకీయ పునరేకీకరణకు నాంది పలికినట్టే కనిపిస్తున్నది.