కేంద్రంలోని నరేంద్ర మోదీ పాలనపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న విమర్శలు, లేవనెత్తుతున్న ప్రశ్నలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వ్యక్తిగత ద్వేషమో, రాజకీయ ప్రయోజనాల కోసమో ఈ విమర్శలు చేయడం లేదనేది సుస్పష్టం. ఈ ఎనిమిదేండ్ల కాలంలో ప్రధాని మోదీ పాలన ఎన్ని విధాలుగా వినాశకరంగా మారిందో సీఎం కేసీఆర్ అంశాలవారీగా చేస్తున్న విమర్శలకు బీజేపీ నేతల నుంచి సమాధానం లేదు. పెరుగుతున్న పేదరికం, నిరుద్యోగం, పడిపోయిన జీవన ప్రమాణాలతో ప్రజలు అతలాకుతలం అవుతుంటే, దేశ సంపదంతా పిడికెడు మంది దగ్గరే పోగుపడుతున్న తీరు మోదీ పాలనకు అద్దం పడుతున్నది. మోదీ ప్రజావ్యతిరేక విధానాలే ఆందోళనలకు ఇంధనంగా మారాయి.
కొన్నాళ్లుగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మోదీ ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా వ్యవహరించిందో దేశమంతా చూసింది. సరిగ్గా ఎన్నికల సమయంలోనే తృణమూల్ నేతలను వేధింపులకు గురిచేసింది. ఈడీ దాడులు మొదలుకొని కేంద్ర సంస్థల ద్వారా అనేక విధాలుగా వెంటాడింది. అక్కడి గవర్నర్ రాజకీయాల్లో తలదూర్చుతూ పరిపాలనారంగంలో జోక్యం చేసుకున్నారు. గవర్నర్ల వ్యవహారంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటుచేసే దాకా వెళ్లిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా ఈ నేపథ్యంలోనే మోదీ వివక్షాపూరిత, ఆధిపత్య విధానాలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిలదీస్తున్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను వేటినీ నెరవేర్చక పోగా, తెలంగాణకు రావాల్సిన నిధుల్లో కోత వేయటం కక్షపూరితమేనని నిరసిస్తున్నారు. సమాఖ్య స్ఫూర్తిని పరిరక్షించుకోవటం కోసం నడుం కట్టాల్సిందిగా రాజకీయవర్గాలను జాగృతం చేస్తున్నారు. మోదీ నియంతృత్వం నుంచి దేశం విముక్తం కావాలన్నది ప్రజాకాంక్షగా ప్రకటిస్తున్నారు.
పాలకుల ఏకపక్ష, నియంతృత్వ పోకడలను మొదటగా ప్రశ్నించేది, ఎదిరించేది ప్రజలే. రైతు వ్యతిరేక నల్లచట్టాలకు నిరసనగా ఉత్తరభారత రైతులు చేసిన పోరాటం దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. రాజకీయాలకతీతంగా ఏడాదిపాటు అలుపెరుగని పోరాటంతో రైతు చట్టాలను వెనక్కి తీసుకునేలా చేశారు. ఇదే స్ఫూర్తి కొనసాగి దేశ రాజకీయాలు పరివర్తన దిశగా సాగిపోతున్న దాఖలాలు స్పష్టమవుతున్నాయి. మోదీ అనుసరిస్తున్న కేంద్రీకృత విధానాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఊపిరి సలపనీయడం లేదు. ఈ పరిస్థితులు ప్రాంతీయ శక్తులను ఉమ్మడి కార్యాచరణ వైపుగా నెట్టుతున్నాయి. మరోవైపు మోదీ విధానాల వల్ల ఏర్పడిన ఆర్థిక అనిశ్చితి ప్రజలలో ఆగ్రహాన్ని పెంచుతున్నది. ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పిలుపు దేశమంతా ప్రతిధ్వనిస్తున్నది.