‘ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు.. నాగులో నాగన్నా; ధరలిట్లా పెరగబట్టె నాగులో నాగన్నా..’ అంటూ నాలుగు దశాబ్దాల కిందట ధరలపై ప్రభుత్వాల తీరును గద్దర్ ప్రశ్నించారు. ప్రస్తుతం మోదీ పాలనలో ప్రజలు మళ్లీ ఈ పాట పాడుకునే పరిస్థితి వచ్చింది. ఐదు రాష్ర్టాల ఎన్నికలు అయిపోయాయి కాబట్టి బాదుడును తిరిగి మొదలుపెట్టింది కేంద్రసర్కార్. రెండు రోజులుగా రోజుకింత పెరుగుతూ హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.110, డీజిల్ రూ.96.37కు చేరుకున్నాయి. వంటగ్యాస్పై ఏకంగా రూ.50 పెంచి సిలిండర్ ధరను వెయ్యి దాటించారు. ప్రజలపై ధరల బండలెత్తవద్దని ప్రతిపక్షాలు ఎంత చెబుతున్నా కేంద్రం పెడచెవిన పెడుతున్నది. టీఆర్ఎస్ సహా విపక్షాలన్నీ ఏకతాటిపై వచ్చి ధరలకు వ్యతిరేకంగా లోక్సభను స్తంభింపజేసినా పట్టించుకోకపోవటం గర్హనీయం.
నిత్యావసర వస్తువులు, సరుకుల ధరలపై తీవ్రప్రభావం చూపే ఇంధన ధరలు మునుపెన్నడూ లేని స్థాయిలో పెరిగిపోవటం ఆందోళనకరం. పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావంతో రవాణా చార్జీలు పెరిగి సకల సరుకుల ధరలూ చుక్కలనంటుతాయి. దాంతో మధ్యతరగతి, సామాన్య ప్రజల జీవనం దుర్భరం కానుంది. ప్రజాజీవనంపై ఇంతటి ప్రభావం చూపే ఇంధన ధరల విషయంలో మోదీ మొదటి నుంచీ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారు. చమురు ఉత్పత్తిపై, అంతర్జాతీయ మార్కెట్లో చమురు బ్యారెల్ ధరలపై పెట్రో ధరలు ఆధారపడి ఉంటాయని మోదీ చెప్పుకొచ్చారు. కానీ అంతర్జాతీయంగా ముడిచమురు ధర గణనీయంగా తగ్గినప్పుడు కూడా ఆ ప్రయోజనం వినియోగదారులకు చేరకుండా, ఎక్సైజ్ సుంకాన్ని పెంచి ఖజానా నింపుకొన్నది మోదీ ప్రభుత్వం. పెట్రోల్, డీజిల్ను ఆదాయ వనరుగానే చూస్తున్న కేంద్రం ధరల పెరుగుదలకు కారణమవుతున్నది.
ద్వంద్వనీతితో ప్రవర్తించటం మోదీ సర్కారుకు అలవాటుగా మారింది. ఇంధన ధరలను పెంచొద్దని అన్నప్పుడల్లా రాష్ర్టాలు వ్యాట్ను తగ్గించుకోవాలని ఉచిత సలహా ఇస్తారు. కానీ తాము మాత్రం లీటరు పెట్రోల్పై రూ.32.98, డీజిల్పై రూ.31.83 మేర ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేస్తారు. ఇక ‘ఉజ్వల’ పథకం కింద పేదలకు కోట్లాది ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని మోదీ గొప్పగా చెప్పుకొంటారు. పెంచిన సిలిండర్ ధరలతో అవన్నీ అలంకారప్రాయంగా మారిపోయే పరిస్థితి నెలకొంది. ప్రకృతి విపత్తులు, కరువు కాటకాలు సంభవిస్తే ప్రజలు తమ జీవనాన్ని తగురీతిన మార్చుకొని సర్దుకుపోతారు. ప్రభుత్వమే వారి జీవనాన్ని కకావికలం చేస్తుంటే.. పాలకుల రీతిని, నీతిని ఎదిరించాల్సిందే. అధిక ధరల వ్యతిరేక ఉద్యమంతో ప్రభుత్వాలనే గద్దెదించిన చరిత్ర మన దేశానికున్నది. కేంద్రంలోని బీజేపీ పాలకులు దీనిని గ్రహిస్తే మంచిది.