పంటల వైవిధ్యంతోనే వ్యవసాయ సమస్యలు తీరుతాయనే మాట తరచూ వింటుంటాం. అలాంటప్పుడు పంట మార్పిడి విధానాన్ని రైతులు ఎందుకు ఇష్టపడటం లేదనేది కీలకమైన ప్రశ్న. 1991లో చేపట్టిన ఆర్థిక సంస్కరణల తర్వాత వచ్చిన కేంద్రప్రభుత్వాలు.. దేశ అవసరాలకు అనుగుణంగా సమగ్ర వ్యవసాయ విధానాన్ని అనుసరించలేదని.. పంట మార్పిడి పట్ల రైతుల అయిష్టతకు ఇదే కారణమనే విషయం స్పష్టమవుతున్నది.
1967లో భారతదేశం తీవ్ర కరువును ఎదుర్కొంది. దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గటమే దీనికి కారణం. 1964-65లో 89 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగగా 1965-66కు అది 72 మిలియన్ టన్నులకు తగ్గిపోయింది. దీంతో విదేశాల నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకు న్నాం. ఈ దిగుమతుల వల్ల 1966-67లో వాణిజ్య లోటు సంభవించింది. 1966-67లో అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గిన మన దేశం రూపాయి విలువను 36.5 శాతం తగ్గించింది. దీంతో ఆహారరంగంలో స్వయంసమృద్ధి కోసం భారత్ 1968లో హరిత విప్లవం వైపు వెళ్లక తప్పని పరిస్థితి వచ్చింది.
1991 నాటికి దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి 176.39 మిలియన్ టన్నులకు చేరుకున్నది. అదేవిధంగా తలసరి నికర ఆహార లభ్యత ఏడాదికి 186.62 కిలోలకు చేరుకొని ఆహారధాన్యాల లభ్యతలో మన దేశం స్వయంసమృద్ధి సాధించింది. అయినా ఇటీవల ప్రకటించిన ‘గ్లోబల్ హంగర్ ఇండెక్స్’లో మనకు 101వ స్థానం లభించింది. అంటే ఆహార లభ్యత ఉన్నప్పటికీ, ఆహార పంపిణీలో తీవ్రమైన లోటుపాట్లున్నాయనే విషయం తేటతెల్లమైంది. ఆహార ధాన్యాలలో మిగులు స్థితికి చేరుకునేదాకా భారత్ కేంద్రీకృత ఆహార సేకరణ విధానాన్ని అనుసరించింది. స్వయంసమృద్ధి తర్వాత 1997-98 నుంచి వికేంద్రీకృత ఆహార సేకరణ విధానాన్ని ప్రారంభించింది. ఈ విధానంలో రాష్ట్రప్రభుత్వాలు ధాన్యాన్ని సేకరించి, తమ అవసరాలకు పోను మిగిలింది ఎఫ్సీఐకి అప్పజెప్తాయి. ఎలాంటి ధాన్యం ఎంత కొనుగోలు చేయాలనే విధివిధానాలు కేంద్రం నిర్దేశించిన మేరకు రాష్ర్టాలు కొనుగోలు చేయవలసి ఉంటుంది. అంటే ఎప్పుడైతే దేశం ఆహార ధాన్యాల మిగులు సాధించిందో, అప్పటినుంచి కేంద్రం ఆహారధాన్యాల సేకరణ బాధ్యత నుంచి మెల్ల్లగా తప్పుకొని ఆ బాధ్యతను రాష్ర్టాలపై బదలాయించింది.
కేంద్రప్రభుత్వం 23 రకాల పంటలకు కనీస మద్దతుధర (ఎంఎస్పీ) ప్రకటించినప్పటికీ గోధుమలు మాత్రమే కొనుగోలు చేస్తున్నది. 2020-21లో వరి 1222.65 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ) ఉత్పత్తి కాగా ఎఫ్సీఐ కొనుగోలు చేసింది 600.74 ఎల్ఎంటీ మాత్రమే. 2020-21లో గోధుమ ఉత్పత్తి సుమారు 1092 ఎల్ఎం టీ ఉండగా, ఎఫ్సీఐ కేవలం 39 శాతమే (390.7 ఎల్ఎంటీ) కొనుగోలు చేసింది. 2020-21లో రూ.1.19 లక్షల కోట్ల విలువైన పప్పులను, రూ.1.17 లక్షల కోట్ల విలువైన వంటనూనెలను మన దేశం దిగుమతి చేసుకున్నది. అంటే పప్పులు, వంటనూనెలలో మన దేశం స్వయం సమృద్ధిని సాధించలేదని అర్థమవుతున్నది.
దేశంలో సుమారు 46 కోట్ల మంది ప్రజలు పోషకాహారలోపంతో బాధపడుతున్నారని పలు నివేదికలు చెప్తున్నాయి. స్త్రీలు, చిన్నపిల్లల్లో ఉన్న తీవ్రమైన పోషకాహార లోపాన్ని, రక్తహీనతను నివారించడం కోసం అంగన్వాడీ కేంద్రాల్లో పీడీఎస్ వ్యవస్థ ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 2019-20లో కొన్ని వందల కోట్ల అంచనా వ్యయంతో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించింది. అనేక స్వచ్ఛంద సంస్థ లు, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పప్పులను, వంట నూనెలను పంపిణీ చేసి దేశంలో పోషకాహారలోపాన్ని కేంద్రం అరికట్టవచ్చు. ఇప్పుడున్న సుమారు 750 మిలియన్ పీడీఎస్ లబ్ధిదారులకు పప్పు, వంటనూనెలను పంపిణీ చేయాలంటే 13 మిలియన్ టన్నుల పప్పులను, వంట నూనెలను కేంద్రం కొనుగోలు చేయవలసి ఉంటుంది. వీటిని కొనుగోలు చేయటం కోసం పల్సెస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇడిబుల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలను స్థాపిస్తే తప్పేమిటి? ఈ సంస్థల ద్వారా రైతులకు పంటమార్పిడి ప్రోత్సాహకాలు ప్రకటించవచ్చు. ఎంఎస్పీ ద్వారా కొనుగోలు చేసి పీడీఎస్ ద్వారా పప్పులు, పంట నూనెలు సరఫరా చేయడం వల్ల రైతులు పంట మార్పిడి చేసే అవకాశం ఉంటుంది. 1997 తర్వాత కేంద్రంలో వచ్చిన ఏ ప్రభుత్వమూ అలా చేయలేదు. ప్రజ ల్లో పోషకాహార లోపాన్ని సవరించే చర్యల్ని చేపట్టలేదు.
మోదీ ప్రభుత్వం కార్పొరేట్ పన్నును మాత్రం 34.61 శాతం నుండి 25.17 శాతానికి తగ్గించింది. 2018-19లో కేంద్రానికి 6.63 లక్షల కోట్ల కార్పొరేట్ పన్ను రాగా 2020-21కి 4.57 లక్షల కోట్లు మాత్రమే వచ్చింది. అంటే కార్పొరేట్ కంపెనీలకు ఏటా2 లక్షల కోట్లకు పైగా ఆదాయం వచ్చేవిధంగా కేంద్రం విధాన మార్పు చేసింది.
కేంద్ర వ్యవసాయశాఖ అగ్మార్కెట్ నెట్ డాటాను క్రోడీకరించి.. 13 రకాల పంటలకు ఎంఎస్పీ ఇవ్వాలంటే సుమారు 2.3 లక్షల కోట్లు అదనంగా కేటాయిస్తే సరిపోతుందని కిరణ్ విస్సా, యోగేంద్ర యాదవ్లు తెలియజేశారు. అంటే 55 శాతం మంది దేశ ప్రజానీకం ఆధారపడి ఉన్న వ్యవసాయరంగంలోని పలు సమస్యలను రూ.2.3 లక్షల కోట్ల అదనపు కేటాయింపులతో పరిష్కరించవచ్చని అర్థం. ఈ మొత్తం కార్పొరేట్ కంపెనీలకు తగ్గించిన పన్నులకు సమానమవడం గమనార్హం. ఎంఎస్పీ భద్రత, సమగ్ర వ్యవసాయ విధానం, యాసంగిలో తెలంగాణ నుంచి ఎఫ్సీఐ పారా బాయిల్డ్ రైస్ కొనుగోలు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పోరాటం చేస్తున్నది. అయితే రైతు సమస్యలను, పోషకాహారలోపాలను పట్టించుకోకుండా వీటిని కూడా రాజకీయ కోణంలో చూడటం మోదీ ప్రభుత్వానికే చెల్లింది.
–పెండ్యాల మంగళాదేవి