Nag Ashwin | టాలీవుడ్లో అత్యంత ప్రతిభావంతులైన దర్శకుల్లో ఒకరైన నాగ్ అశ్విన్ ప్రస్తుతం లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన వినూత్న చిత్రం ‘సింగ్ గీతం’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. 94 ఏళ్ల వయసులో సింగీతం రూపొందించిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ సమర్పకుడిగా, నిర్మాతగా వ్యవహరించడం విశేషం. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న నాగ్ అశ్విన్ తాజాగా తన వర్కింగ్ స్టైల్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇంటర్వ్యూలో భాగంగా జర్నలిస్టులు ఆయనను ‘కల్కి 2898 ఏడీ’ వంటి భారీ బడ్జెట్ చిత్రాల షూటింగ్ సమయంలో ఒత్తిడి కారణంగా కోపం వస్తుందా? అనే ప్రశ్న అడిగారు. దీనికి స్పందించిన నాగ్ అశ్విన్, షూటింగ్ సమయంలో ఒత్తిడి, టెన్షన్ సహజమేనని తెలిపారు. అయితే ఆ కోపాన్ని యూనిట్ సభ్యులపై చూపించడం తనకు ఇష్టం ఉండదని స్పష్టం చేశారు.
ఒక దర్శకుడు సెట్స్లో కోపంతో అరిస్తే అక్కడి వాతావరణం దెబ్బతింటుంది. దాని ప్రభావం పనిపై పడుతుంది. కొన్నిసార్లు అది రీషూట్స్ వరకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే నేను కోపం కంటే సమస్యకు పరిష్కారం కనుగొనడంపైనే ఎక్కువ దృష్టి పెడతాను అని నాగ్ అశ్విన్ వెల్లడించారు. సినిమా నిర్మాణంలో ప్రతి సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని ఆయన అన్నారు. ఒక దర్శకుడి విజన్ను తెరపై ఆవిష్కరించేందుకు యూనిట్ సభ్యులు రాత్రింబవళ్లు కష్టపడుతుంటారు. అలాంటి సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్లు, మేనేజర్లు లేదా ఇతర సిబ్బందిపై అరిచేయడం సులభమే. కానీ దానివల్ల సమస్య పరిష్కారం కాదు. అందుకే పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తాను అని చెప్పారు.
అలాగే కొన్నిసార్లు తనపై తనకే ఎక్కువ కోపం వస్తుందని నాగ్ అశ్విన్ తెలిపారు. సెట్స్లో ఏదైనా సమస్య ఎదురైతే, దాన్ని ముందుగానే ఎందుకు గుర్తించలేకపోయానని నన్ను నేనే ప్రశ్నించుకుంటాను. ఆ సమయంలో ఇతరులపై కోపం చూపడం కంటే నా తప్పులను విశ్లేషించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తాను అని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం ‘సింగ్ గీతం’ విజయాన్ని ఆస్వాదిస్తున్న నాగ్ అశ్విన్, మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్తో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్ ‘కల్కి 2’ పనుల్లో కూడా బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సీక్వెల్పై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో నాగ్ అశ్విన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.