ఆకలి, ఆరోగ్యం.. ఈ రెండింటి సమాహారమే మానవ జీవితం. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం నిబద్ధతతో కృషిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నది. ఆ క్రమంలోనే ప్రభుత్వ దవాఖానలను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దటమే కాకుండా అందరికీ అందుబాటులో ఉండేవిధంగా పల్లె, బస్తీ దవాఖానలను పెద్ద ఎత్తున ఏర్పాటుచేయటం ఆహ్వానించదగిన పరిణామం.
హైదరాబాద్లో ఇప్పటికే 224 బస్తీ దవాఖానలు ప్రారంభమయ్యాయి. 5 నుంచి 10 వేల మంది ప్రజలకు ఒక బస్తీ దవాఖాన ఏర్పాటుచేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకుపోతున్నది. ఒక్క హైదరాబాద్కే పరిమితం కాకుండా తెలంగాణలోని ప్రతి నగరం, పట్టణం, పల్లెలో దవాఖానల ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. నగరంలోని బస్తీవాసులందరికీ వైద్య సేవలందించేందుకు ఇప్పటికే ఉన్న దవాఖానలకు తోడు కొత్తగా 32 దవాఖానలను ఈ మధ్యనే ఏర్పాటుచేసింది. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం దవాఖానల సంఖ్య 258కి చేరింది. మరో 92 చోట్ల ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించటం ముదావహం. ఈ క్రమంలోనే ఓల్డ్ బోయిన్పల్లి, శాంతినికేతన్ కాలనీలో బస్తీ దవాఖానలు ప్రారంభమయ్యాయి. అలాగే రాష్ట్రంలోని ఇతర నగరాల్లో కూడా 144 దవాఖానలను ఏర్పాటుచేయబోతున్నది. ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత వైద్యం, ఉచిత పరీక్షలు చేస్తున్నారు. దీంతో ఇవి బస్తీల సుస్తీ పోగొట్టి దోస్తీ దవాఖానలుగా దేశానికే రోల్ మాడల్గా మారాయి.
ప్రజలకు ఉచిత వైద్యం, రోగ నిర్ధారణ పరీక్షలు టీ డయాగ్నొస్టిక్ కేంద్రాల ద్వారా ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. 57 రకాల పరీక్షలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో బస్తీ దవాఖానలు, జిల్లా స్థాయిలో సూపర్ స్పెషాలిటీ దవాఖానలు ప్రజలకు సేవలందిస్తున్నాయి. 15వ ఆర్థిక సంఘం కూడా దేశంలోని మిగతా నగరాల్లో బస్తీ దవాఖానల వంటివి ఏర్పాటు చేయాలని సూచించటం గమనార్హం.
నాయకులకు ప్రజలపై నిబద్ధత ఉంటే అన్నివిధాలా సంక్షేమ ఫలాలు అందుతాయి. ప్రజలు రోగాల బారిన పడకుండా కాపాడటంలో, ఒకవేళ రోగాల బారిన పడి నా ఆ రోగాలను ప్రాథమిక స్థితిలోనే గుర్తించి వాటిని అరికట్టడంలో బస్తీ దవాఖానలు తోడ్పడు తాయి. రోగాలను ప్రారంభంలోనే గుర్తించి తగు చికిత్స అందించగలిగితే అవి ప్రాణాంతకం కాకుండా అడ్డుకోవడం సాధ్యం. పేదలకు ఆర్థికంగా, దూరం పరంగా ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారిని బస్తీ, పల్లె దవాఖానలు ఆదు కుంటాయి. అలాగే ఆరోగ్యంపై పేదలకు సరైన అవగాహన కల్పించి రోగాల బారినుంచి రక్షణ పొందటంలో తోడ్పడుతున్నాయి.
కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న పరిస్థితుల్లో బస్తీ దవాఖానల పాత్ర ముఖ్యమైనది. ఒమిక్రాన్ అనే కరొనా కొత్త వేరియంట్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో మరింత జాగ్రత్తలతో మసలుకోవాలి. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి, భౌతికదూరం పాటించాలి. దీనికి తోడు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. అలసత్వం వలదు. వ్యాక్సిన్ మొదటి డోసు 91 శాతం మంది తీసుకోగా, రెండో డోసు 47 శాతం మంది మాత్రమే తీసుకోవటం నిర్లక్ష్యానికి నిదర్శనమే.
రెండు డోసుల టీకా విధిగా వేసుకుంటేనే రక్షణ అని గ్రహించాలి. పరిస్థితులను బట్టి బస్తీ, పల్లె దవాఖానల్లోనే కొవిడ్ పరీక్షలు నిర్వహించి ప్రజలకు భరోసాగా నిలిచేవిధంగా వైద్య సేవలు విస్తరించటానికి ప్రభుత్వం ఆలోచించటం హర్షణీ యం.
గోసుల శ్రీనివాస్యాదవ్, 98498 16817
(వ్యాసకర్త: రాష్ట్ర గొల్లకురుమ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు)