‘బీభత్స రసప్రధానం.. పిశాచగణ సమవాకారం..’ అన్న తీరున రాష్ట్ర బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ‘వరిధాన్యం కొనుగోళ్ల క్షేత్రస్థాయి పరిశీలన’ పేరిట బండి సంజయ్ యాత్ర హింసాత్మకంగా, విధ్వంసకరంగా సాగుతున్నది. ఇది తెలంగాణ సమాజంపై దండయాత్రగా పరిణమించినది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పర్యటనలో ఆయన అనుచరగణం వ్యవసాయ మార్కెట్లలో చేసిన హింసాదౌర్జన్యాలు వారి విధ్వంస ప్రవృత్తికి అద్దం పడుతున్నాయి. ప్రశాంత వాతావరణంలో ఐక్యంగా ప్రగతిదారిన పయనిస్తున్న తెలంగాణ రైతు లోకంలో బీజేపీ భద్రతారాహిత్యాన్ని పెంచుతూ, విద్వేషాలు రాజేయజూస్తున్నది. రైతులను తప్పుదారి పట్టించి, ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న వ్యవసాయ రంగాన్ని మళ్ళా సంక్షోభంలోకి నెట్టాలనే కుట్రలు సాగిస్తున్నది.
గురివింద తన నలుపెరుగదన్నట్లు.. సమస్యంతా తమదగ్గర పెట్టుకొని అటు కేంద్రం, ఇటు రాష్ట్ర బీజేపీ నేతలు రైతులను వంచిస్తున్నారు. యాసంగి పంటనుంచి వరిని కొనబోమని కేంద్రమే అంటున్నది. మరిక ఇక్కడి బీజేపీ నేతలు కొనుగోళ్లపై నానా యాగీ చేయడమేమిటి? రైతుల ప్రయోజనాలకు భంగం వాటిల్లే కార్పొరేట్ అనుకూల నల్లచట్టాలు తెచ్చింది మోదీ ప్రభుత్వమే. ఈ చట్టాలకు నిరసనగా రైతులు ఏడాదిగా పోరాడుతున్నా పట్టించుకోవటం లేదు. ఈ నిరసనోద్యమంలో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు రైతులు ఉద్యమ శిబిరాల్లోనే ఉరేసుకుంటే, మరికొందరు ప్రతికూల వాతావరణ పరిస్థితులకు బలయ్యారు. నిరసనోద్యమంలో ఉన్న రైతులను కర్రలతో కొట్టడం, వాహనాలను నడిపించి హతమార్చడం ప్రజాస్వామిక చరిత్రలోనే ఎన్నడూ కాననిది.
ఇంతకూ బీజేపీ నేతలకు ఎందుకింత కడుపు మంట? కేంద్ర ప్రభుత్వం సాధించలేని, బీజేపీ పాలిత రాష్ర్టాలలో కనిపించని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నందుకేనా? సాగునీరు, విద్యుత్ ఇచ్చి రైతులకు అనేక రకాలుగా ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల ధాన్యం దిగుబడి గణనీయంగా పెరిగింది. ప్రతి గింజనూ కొంటామని రైతులకు హామీనిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం గత ఆరేండ్లుగా మాట మీద నిలిచి రైతులకు బాసటగా నిలిచింది. కరోనా కష్టకాలంలో కూడా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యాన్ని కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. వైవిధ్య పంటలు, మార్కెటింగ్ సమాచారం, యాంత్రీకరణ, సరికొత్త శాస్త్రీయ విధానాలు, వ్యవసాయాధార, అనుబంధ వ్యాపారాలు, ఆహారశుద్ధి పరిశ్రమలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమగ్ర ప్రణాళికకు రూపుదిద్దారు. తదనుగుణంగా రైతులను ముందుకు నడిపిస్తున్నారు. ఈ దశలో బీజేపీ నాయకులు చేస్తున్న చెడగొట్టు పనులను రైతులు తిరస్కరించాలి. కేసీఆర్ నిర్దేశించిన రీతిలో వ్యవసాయాన్ని సాగించాలి.