‘సదర్’ అంటే తెలియని హైదరాబాదీ ఉండడు. భాగ్యనగరం కేంద్రంగా దాదాపు 200 ఏండ్లకు పూర్వమే ఈ సదర్ వేడుకలు ఉన్నవని శాసనాల ద్వారా తెలుస్తుంది. మన నగరం ఎలా దినదినాభివృద్ధి చెందుతున్నదో, సదర్ ఉత్సవం కూడా అలానే ప్రాచుర్యం పొందుతున్నది. దీపావళి పండుగ తర్వాత రెండో రోజు యాదవులు ఈ ‘సదర్’ ఉత్సవాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.
యాదవులు ఈ పండగను దృష్టిలో పెట్టుకొని కొన్ని నెలలముందు ‘ముర్రా జాతికి చెందిన దున్నలను హర్యానా, పంజాబ్, జింద్, హిస్సర్, కురుక్షేత్ర లాంటి ప్రాంతాల నుంచి తీసుకువస్తారు.
ఈ ముర్రా జాతి దున్నలలో ప్రధానంగా 5 రకాలుంటాయి. వాటిలో హైదరాబాద్ షెహెన్షా, రుస్తుం, యువరాజు, ట్రంప్ దూడ, మహారాజ మొదలగువాటిని సదర్కు ముస్తాబు చేస్తారు.
పురాణేతిహాసాల ప్రకారం యాదవ కులస్థులు శ్రీకృష్ణుని వారసులుగా చెప్పుకొంటారు. శ్రీకృష్ణుడు ఆలమందలను (పశువుల సంపదను) పెంచిపోషించాడు. మానవ జీవితంలోనూ కొన్ని సామాజిక తరగతులకు, కులాలకు పశువులను పెంచడం ఒక వృత్తిగా మారింది. యాదవ కులస్థులూ పశు సంపదను పెద్ద ఎత్తున కలిగి ఉంటారు. తమ వృత్తి నుంచి ఆవిర్భవించిన ఉత్సవం నేడు క్రమ క్రమంగా సదర్ ఉత్సవంగా ఆదరణ పొందుతున్నది!
ద్వాపరయుగంలో యాదవుల కుటుంబాల్లో శ్రీకృష్ణుడి బాల్యం గడిచింది. అలా యాదవుల్లో శ్రీకృష్ణుడికి విశిష్టమైన స్థానం ఉన్నది. యాదవులు ఆ కాలం నుంచే యుద్ధ విన్యాసాల్లో, ధైర్య సాహసాల్లో పెట్టింది పేరుగా ఉండేవారు. మరోపక్క జంతువుల సంరక్షణ చేసేవారు. ఆలమంద (గేదె, అవు, గొర్రె, మేక)లను సొంత కుటుంబసభ్యుల వలె పెంచేవారు. అప్పటి వ్యాపార సముదాయాల్లో బియ్యం, పప్పు దినుసులు, ఆల మందలు మొదలైనవాటికి బాగా విలువ ఉండేది. అప్పట్లో డబ్బు ఉండేది కాదు. వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. అప్పట్లో పశువులకు మంచి డిమాండ్ ఉండటం వల్ల ఒకచోట నుంచి మరోచోటికి వస్తువు మార్పిడి జరిగేది. ఆ రోజుల నుంచి కాలక్రమేణా నాణేల మార్పిడి వరకు ముఖ్యమైన ప్రదేశాల్లో వ్యాపార సముదాయాల లావాదేవీల కేంద్రాలను సదరు అని పిలిచేవారు. అలా అది సదర్ ఉత్సవంగా మారింది.
భాగ్యనగరంలోని కాచిగూడ, నారాయణగూడ, ఖైరతాబాద్, సైదాబాద్, బోయిన్పల్లి, ఈస్ట్మారెడ్పల్లి, చప్పల్బజార్, మధురా పూర్, పాతబస్తీ తదితర మరికొన్ని ప్రాంతాల్లో ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాలు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజల దృష్టిని ఆకర్షించేస్థాయిలో కొనసాగుతాయి. గతంలో యాదవ కులస్థులు ఎక్కువగా ఉండే మున్సిపల్ డివిజన్లు, కాలనీలు, అపార్టుమెంట్ల ప్రాంగణాల్లో ఎక్కువ జరుగుతుండేవి. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమంతా యాదవులు ఘనంగా సదర్ను నిర్వహిస్తున్నారు.
యాదవులు ఈ పండగను దృష్టిలో పెట్టుకొని కొన్ని నెలల ముందు ‘ముర్రా జాతికి చెందిన దున్నలను హర్యానా, పంజాబ్, జింద్, హిస్సర్, కురుక్షేత్ర లాంటి ప్రాంతాల నుంచి తీసుకువస్తారు. ఈ ముర్ర జాతి దున్నలలో ప్రధానంగా 5 రకాలుంటాయి. వాటిలో హైదరాబాద్ షెహెన్షా, రుస్తుం, యువరాజు, ట్రంప్ దూడ, మహారాజ మొదలగువాటిని సదర్కు ముస్తాబు చేస్తారు.
ఈ దున్నల ఖరీదు సుమారుగా రూ.15 కోట్ల నుంచి 25 కోట్ల వరకు ఉంటుంది. వీటికి ప్రతిరోజూ 50 లీటర్ల పాలు, వందల సంఖ్యలో ఆపిల్, బాదం, పిస్తా, కాన్బెర్రా, బ్లూబెర్రీ ఆహారంగా ఇస్తారు. వైన్, విస్కీ కూడా వీటికి తాగిస్తారు. ఒక్కోదానికి నలుగురు సంరక్షకులు ఉంటారు. ప్రతిరోజూ రెండు సార్లు స్నానం చేయిస్తారు! ఒక మనిషికి అవసరమైనట్లుగా వీటికి కూడా ప్రత్యేక గది, అందులో ఫ్యాన్ ఉంటుంది. రోజుకు రెండు సార్లు ఆయిల్ మసాజ్ చేస్తారు. పండుగకు వారం ముందుగానే అలంకరణ ప్రారంభిస్తారు. దున్నపోతుల శరీరంపై ఉన్న వెంట్రుకలను తొలగించి నల్లగా నిగనిగలాడేలా తయారుచేస్తారు. అందుకు వెన్న లేదా పెరుగు ఉపయోగిస్తారు. కొమ్ములను రంగురంగుల రిబ్బన్లతో చుడుతారు. నెమలీకలను అమర్చుతారు.
అలంకరించిన తర్వాత సుగం ధ ద్రవ్యాలను చల్లుతారు. అలంకరించిన దున్నపోతులతో ఉత్సాహం కలిగిన యువకులు కుస్తీ పడతారు. ముక్కుతాడును చేతబట్టుకొని అదుపు చేస్తారు. ఈ క్రమంలో దున్నపోతు తన ముందరికాళ్లను పైకెత్తి యువకులతో సమానంగా డ్యాన్స్ చేస్తుంది. అయితే భారీ శరీరం కావడంతో దున్నలను జాగ్రత్తగా చూసుకుంటారు. కొన్నింటిని గంగిరెద్దులా ఆడించే ప్రయత్నం చేస్తారు. ఎంపిక చేసిన ఆవరణలో, ఖాళీ ప్రదేశంలో, బస్తీల్లో ఈ వేడుకలు నిర్వహిస్తారు. యువకులు, మహిళలు, విద్యార్థులంతా ఈ ఉత్సవాలను చూసేందుకు అమితాసక్తిని కనబరుస్తారు. యువకులు తీన్మార్ డాన్స్లతో హోరెత్తిస్తారు. ఈ ఉత్సవాలు ‘బఫెలో కార్నివాల్స్ ఆఫ్ హైదరాబాద్’ పేరుతో ఘనంగా జరుగుతాయి.
పీలి కృష్ణ
78010 04100