ఒకానొక సందర్భంలో ఒక జాతి గుర్రం యుద్ధానికి సన్నద్ధమవుతుంది. ‘ఇంకా సమయం ఉంది కదా!’ అని సమీపంలో ఉన్న మైదానంలో వేగంగా పరిగెత్తుతూ తన పిక్కబలానికి తానే మురిసిపోయింది. యుద్ధ రంగంలో మెరుపు వేగంతో దూసుకుపోతానని విర్రవీగింది. అప్పుడు ఓ గాడిద పెద్ద మూటతో వీపు బరువెక్కి భారంగా అడుగులు వేస్తూ అటు వచ్చింది. గాడిదను చూడగానే గుర్రం వికటంగా సకిలించింది. ‘ఓ గార్దభమా! దారినుంచి అడ్డు తొలుగు’ అంది. భారీ మూటతో కదల్లేక గాడిద అలాగే నిలిచిపోయింది. గుర్రానికి కోపం వచ్చింది. ‘నీకేమైనా చెవుడా! చెప్తుంటే వినిపించడం లేదూ!’ అంది. గాడిద నిదానంగా పక్కకు జరిగింది. గుర్రం సమీపించి ‘యుద్ధానికి వెళ్తున్నా. నా వేగం చూశావు కదా! గాడిదగా పుట్టిన నిన్ను చూస్తుంటే జాలి కలుగుతున్నది. ఈ జన్మలో నా అంత వేగంగా పరిగెత్తగలవా?’ అని అవహేళన చేసింది. గుర్రం మాటలకు మనసు చివుక్కుమన్నా.. చేసేదేం లేక గాడిద మౌనంగా ఉండిపోయింది.
యుద్ధం ముగిశాక రోజూలాగే గాడిద వీపున బండెడు మూటతో మైదానంలో నిదానంగా వెళుతున్నది. దూరంగా బాగా బక్కచిక్కిన గుర్రం కనిపించింది. విరిగిన కాలుతో నడవలేక బాధపడుతున్నది గుర్రం. గుర్రానికి సరైన బుద్ధి చెప్పాలనుకుంది గాడిద. ‘మిత్రమా! ఎంత కష్టం వచ్చింది. వాయువేగంతో దూసుకుపోయే నువ్వు.. ఇప్పుడు కనీసం నాతో సమానంగా కూడా నడవలేని స్థితికి చేరుకున్నావు’ అని కీలెరిగి వాత పెట్టింది. గుర్రం తలదించుకుంది.
కలిమి లేములు కలకాలం ఉండవు. సంపద ఉన్నప్పుడు గర్వంతో మిడిసిపడొద్దు. మనిషి వ్యక్తిత్వం అతను పేదరికంలో ఉన్నప్పుడు తెలియదు. ఐశ్వర్యంలో తులతూగుతున్నప్పుడే ఆ వ్యక్తి నిజమైన నైజం ఏంటో బయటపడుతుంది. సంపద శాశ్వతం అనే భ్రమలో కొందరు ఎదుటివారిని చులకనగా చూస్తుంటారు. అవతలి వ్యక్తి మనసు కష్టపెట్టేలా మాట్లాడుతుంటారు. ధనబలం కారణంగా ఆ వ్యక్తిని ఆక్షేపించే సాహసం ఎవరూ చేయరు. కానీ, అదే వ్యక్తి సంపద కోల్పోయినప్పుడు అతణ్ని చేరదీసేవారు కరువవుతారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నప్పుడే నిజమైన గుర్తింపు లభిస్తుంది. – ఎ.భరత్కుమార్ శర్మ