ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బయ్యారం ఉక్కు కర్మాగార స్థాపనను తిరస్కరించడం తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేయడమే. పార్లమెంటు సాక్షిగా ఏపీ పునర్వ్యవస్థీకరణచట్టం-2014 ప్రకారం బయ్యారంలో ఉక్కు కర్మాగారం స్థాపించడానికి అప్పటి యూపీఏ ప్రభుత్వం స్పష్టంగా అంగీకరించింది. ఆ చట్టాన్ని అప్పటి ప్రతిపక్షమైన బీజేపీ కూడా బలపర్చింది.
బయ్యారం ఉక్కు కర్మాగారంతో పాటు వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్శిటీ, ప్రత్యేక ఆర్థిక సహాయం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా లాంటి విభజన చట్టంలోని వాగ్దానాలను కేంద్రం విస్మరించింది. ఈ తరుణంలో బయ్యారం స్టీల్ ప్లాంటుకు అర్హత లేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేసిన ప్రకటన తెలంగాణ సమాజానికి పిడుగులాంటి వార్త. 2017లో హైదరాబాద్లో జరిగిన ఎన్ఎండీసీ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్న అప్పటి కేంద్రమంత్రి బీరేంద్రసింగ్ పెలటైజేషన్, స్క్రాప్ ఆధారిత కర్మాగారాలను కొత్తగూడెం, పాల్వంచలలో ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఈ హామీలకు విరుద్ధంగా కేంద్రం చేసిన ప్రకటనను నిరసిస్తూ రాష్ట్ర మంత్రి కేటీఆర్, ఇప్పటి ఉక్కు శాఖ మంత్రి రాంచందర్ప్రసాద్ సింగ్కు లేఖ రాశారు. తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న సవతితల్లి ప్రేమను తీవ్రంగా ఖండించారు.
ఉమ్మడి రాష్ట్రంలో బయ్యారం ఇనుప ఖనిజాన్ని దోపిడీ చేసే క్రమంలో బయ్యారం, గార్ల, కొండపల్లి, గూడూరు మండలాల్లో 1,41,691 ఎకరాల భూమిని రక్షణ స్టీల్స్కు ఎక్స్ప్లోరేషన్ పేరుతో సబ్ లీజుకు ఇచ్చారు. అలాగే పక్కనే ఉన్న గార్ల మండలంలో ఇండియన్ బెరైటీస్ అండ్ కెమికల్స్, లక్ష్మీ ట్రైబల్ మైనింగ్ సొసైటీ, కనకదుర్గ ట్రైబల్ సొసైటీ, విశ్వభారతి మైనింగ్ కార్పొరేషన్ పేర్లతో అప్పటి అధికార పార్టీ ప్రభుత్వ పెద్దల కుటుంబసభ్యులు, సహచర నేతల పేరుతో వేల కోట్ల విలువ చేసే బెరైటీస్ను దోచుకున్నారు.
ఆ క్రమంలోనే ఈ వ్యాసకర్త 2010 జూన్ 11న అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆ తర్వాత అన్ని ప్రతిపక్షాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి ఆ లీజులన్నిటిని రద్దు చేయించారు. తెలంగాణలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటును విభజన చట్టంలో పొందుపర్చేలా కేంద్రాన్ని ఒప్పించారు.
కేంద్రానికే చెందిన ‘జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ నివేదిక ప్రకారం బయ్యారం పరిసర ప్రాంతాలలో 54 శాతం నుంచి 65 శాతం వరకు (ఎఫ్ఈ) నాణ్యత కలిగిన 300 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం నిక్షిప్తమై ఉన్నది. ప్రభుత్వం చేసిన సర్వేనే పరిగణనలోకి తీసుకోకుండా అక్కడ ఐరన్ ఓర్ లేదని, నాణ్యత లేదని కేంద్రం అబద్ధపు ప్రచారాలు చేయడాన్ని మంత్రి కేటీఆర్ ఖండించారు. ఇనుప ఖనిజం నిక్షేపాలకు సంబంధించి ఒక ప్రైవేటు సంస్థ సర్వే ప్రకారం 525 మిలియన్ టన్నులు లభ్యత ఉంటుందని పేర్కొన్నది. అదే ఉత్పత్తి బయటనుంచి కొనాలంటే దాదాపు రూ.60 లక్షల కోట్ల ఖర్చవుతుంది. 22 శాతం నుంచి 35 (ఎఫ్ఈ) నాణ్యతా శాతం కలిగిన లోగ్రేడ్ ఇనుప ఖనిజం మరో 2 వేల మిలియన్ టన్నులు ఉంటుంది. దీని విలువ దాదాపు రూ.40 లక్షల కోట్లు. రూ.65 వేల కోట్ల విలువ కలిగిన డోలమైట్ ఉంటుంది.
ఇంత విలువైన ఇనుప ఖనిజ లభ్యత ఉండగా ఒక్క వేటుతో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కూల్చివేయడం దురదృష్ట కరం. ఉక్కు కర్మాగారానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు బయ్యారా నికి అందుబాటులో ఉన్నాయి. ఛత్తీస్గఢ్ నుంచి బయ్యారం ప్లాంటుకు ఇనుప ఖనిజాన్ని రవాణా చేయడానికి ఎన్ఎండీసీ 2016లోనే అంగీకరించింది. బైలదిల్లా లాంటి ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే ఖనిజానికి మన దగ్గర లభ్యమవుతున్నటువం టి 54 నుంచి 65 శాతం నాణ్యత కలిగిన ఖనిజాన్ని జోడించి తద్వా రా పూర్తి నాణ్యత కలిగిన ఐరన్ను తయారుచేసుకొని బయ్యారం లోనే స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవచ్చు. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 వేల మందికి ఉపాధి లభిస్తుంది.
3 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తికి 6 మిలియన్ టన్నుల ముడి ఇనుము అవసరం. ఆ విధంగా దాదాపు 75 ఏండ్లకు పైగా స్టీల్ ప్లాంట్ను నిర్వహించుకోవచ్చు. ఏపీ స్టీల్తో కలిపి 427 ఎకరాలు గా ఉన్న ఈ ప్లాంట్లో రూ.100 కోట్లు ఖర్చుపెడితే రామెల్ట్ ప్లాం టు, రోలింగ్ మిల్ ఏర్పాటుచేసుకోవడం ద్వారా పాల్వంచలో కూడా వేల మందికి ఉపాధి లభిస్తుంది. చైనా 22 శాతం నాణ్యత ఉన్న ఖనిజం దొరికినప్పటికి, బూడిద, చూరులాగా ఉండే ఖనిజాన్ని కూడా కొనుగోలు చేసి బెనిఫిషియేషన్ ప్లాంట్ (శుద్ధి చేయడం) ద్వారా ఎంతో ప్రయోజనం పొందుతున్నది. ఒక్క టన్ను కూడా వృథా కానివ్వదు. అదేవిధంగా మన దగ్గర కూడా పెలటైజేషన్ ప్లాంట్ను గాని, బెనిఫిషియేషన్ ప్లాంట్లు గాని ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించాలి. అప్పుడే జాతి సంపద వృథా కాకుండా ఉంటుంది.
(వ్యాసకర్త: మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి)
కూనంనేని సాంబశివరావు