తాగునీటిని కూడా సింగపూర్ దిగుమతి చేసుకుంటుంది. మన దేశంలో ఉన్న సహజ వనరుల్లో కనీసం ఒక్క శాతం కూడా లేవక్కడ. కానీ, ప్రపంచంలోని ఎన్నో దేశాలకు పలురకాల ఎగుమతులు చేస్తుంది. సింగపూర్ వైశాల్యం కేవలం 274 చదరపు కిలోమీటర్లు. జనాభా 54 లక్షలు. అయినా, ఒక దశలో అమెరికా జీడీపీని కూడా అధిగమించింది. ప్రపంచంలో 10వ ధనిక దేశంగా ఎదిగింది.
ఇక అమెరికా గురించి చెప్పుకొంటే.. అప్పులు ట్రిలియన్ డాలర్లలో ఉన్నాయి. మనకూ సుమారు 541 బిలియన్ డాలర్ల అప్పున్నది. సింగపూర్కు అప్పు అనేదే లేదు. ఆదాయమంతా ఎలక్ట్రానిక్స్, మెషినరీ ఎగుమతులు, టూరిజం, కోస్టల్ కార్గో నుంచి వస్తున్నదంటే ఆశ్చర్యంగా ఉంటుంది. సింగపూర్కు 1965లో స్వాతంత్య్రం వచ్చింది. మరి ఇంత అభివృద్ధి ఎలా సాధ్యమైంది?
సింగపూర్ తొలి ప్రధాని ‘లీ క్వాన్ యూ’ చేసిన కృషికి ఫలితం, ప్రతిరూపం ఇప్పటి సింగపూర్. మనిషి మనుగడకు, అభివృద్ధికి పనికిరాని విషయాలను పక్కనబెట్టి, ఏం చేస్తే దేశం అభివృద్ధి పథంలో ముందుకుపోతుందో అది మాత్రమే చేస్తూ, ఒక బ్లూ ప్రింట్ తయారుచేశారు లీ క్వాన్. దాని పునాదుల మీదే సింగపూర్ అభివృద్ధి సాధిస్తున్నది.
మన దేశంలో ఉన్న సహజవనరులు, మానవ వనరులు బహుశా ఇంకే దేశంలోనూ లేవు. మనం వినియోగించుకోలేకపోతున్నాం అంతే. అమెరికా వంటి దేశాల్లోని అగ్రస్థాయి కంపెనీల్లో 70 శాతం కంపెనీలను నడిపిస్తున్నది భారతీయులే. అమెరికా ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో అనేక కీలక పదవుల్లో ఉన్నది కూడా భారత సంతతివారే.
మనకు స్వాతంత్య్రం వచ్చి 74 ఏండ్లయినా మనం ఎందుకని ఇంకా ‘అభివృద్ధి చెందుతున్న దేశం’గానే ఉంటున్నాం? ఎందుకంటే, ఇప్పటివరకు దేశాన్ని ఏలినవాళ్లంతా రెండే అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఒకటి- వ్యక్తిగత కీర్తి కండూతి. రెండోది- మనిషి మనుగడకు, అభివృద్ధికి ఏ రకంగానూ ఉపయోగ పడని అంశాల మీదే దృష్టిపెట్టి, ఎప్పటికప్పుడు ప్రజల మధ్య అగ్గి రాజేయటం, ఆజ్యం పోయడం. ఒకరిద్దరెవరైనా ఏదైనా చేయాలని ప్రయత్నించినా, వాళ్లు ఆధారపడి ఉన్న ఇతర రాజకీయగణం అంతా ఇదే మైండ్సెట్తో ఉన్నప్పుడు వారు మాత్రం ఏం చేయగలరు? ఇప్పటివరకూ జరిగిందిదే. ఇలాంటి ఆలోచనాధోరణి ఉన్న ఒక నాయకగణం మారితే తప్ప మనదేశంలో అభివృద్ధి సాధ్యం కాదు. కానీ అదంత సులభ సాధ్యం కాదని నిన్నమొన్నటి పరిణామాలు సూచిస్తుండటం బాధాకరం.
2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తర్వాత, ఈ దేశానికి ఆయనేదో చేస్తాడని చాలామంది ఆశించారు. ప్రధానిగా మోదీ అద్భుతాలు సృష్టించవచ్చునని ఆశిస్తూ నేను కూడా అప్పుడు ఒక బ్లాగ్ రాశాను.
గుజరాత్ విధానసభలోకి మోదీ తొలిసారి ప్రవేశించింది ముఖ్యమంత్రిగానే. అలాగే, పార్లమెంట్ సెంట్రల్ హాల్లోకి మోదీ ప్రవేశించింది కూడా ఒక ప్రధానిగానే అని మీడియా కూడా మోదీని ఆకాశానికెత్తింది. దురదృష్టవశాత్తు ఈ విజయం నాణేనికి ఒక వైపే. నాణేనికి మరోవైపు దేశం కోసం మోదీ సాధించింది శూన్యం. ఎవరికైనా పదవి సాధించడం ఒక్కటే లక్ష్యం కాకూడదు. ఆ పదవి ఇచ్చే బలంతో, అంతకు వందరెట్లు దేశం కోసం చెయ్యగలగాలి. కానీ, గత ఎనిమిదేండ్లలో అలా జరగలేదు. బంగ్లాదేశ్ వంటి చిన్నదేశాలు కూడా కొన్ని అంశాల గణాంకాల్లో మన దేశాన్ని దాటి వేస్తున్నాయంటే, మనవాళ్ల పాలన ఏ దిశగా వెళ్తున్నదో అర్థం చేసుకోవచ్చు. గత ఎనిమిదేండ్లుగా దేశంలో ఎలాంటి అభివృద్ధి లేదు. ఇంకో ఎనిమిదేండ్లు వెనక్కివెళ్లింది.
ఇదే సమయంలో తెలంగాణను చూస్తే పూర్తి భిన్నమైన దృశ్యం కనిపిస్తుంది. ఆరు దశాబ్దాల కిందటి తెలంగాణ వేరు, ఇప్పుడు కండ్లముందున్న తెలంగాణ వేరు. ఈ మహత్తర మార్పునకు కారణం కేసీఆర్. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదన్నచోటే, 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారు. మరొక బీహార్ అయిపోయి ఐటీ మాయమైపోతుందన్నారు. కానీ ఊహించనిస్థాయిలో తెలంగాణలో ఐటీ అభివృద్ధి చెందుతున్నది. ప్రపంచ టాప్ టెన్ కంపెనీలన్నీ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాయి. వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్లతో పాటు ఎవరూ కలలో కూడా ఊహించని విధంగా ఆదిలా బాద్ జిల్లాకు కూడా తెలంగాణ ఐటీ సామ్రాజ్యం విస్తరిస్తున్నది. క్రెడిట్ గోస్ టు కేటీఆర్ అండ్ టీం. ఆయన లాంటి డైనమిక్ మంత్రి మా రాష్ట్రంలో కూడా ఉంటే బాగుండునని చాలా రాష్ర్టాల ప్రజలు అనుకుంటున్నారు.
గత ఆరున్నర దశాబ్దాలుగా తాగునీటికి నోచుకోని ఎన్నో గ్రామాల ప్రజలు ఇప్పుడు ‘మిషన్ భగీరథ’ ద్వారా మంచినీళ్లు తాగుతున్నారు. ‘నీరు పల్లమెరుగు’ అన్న సామెత చెప్తూ, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఒక ఆంధ్ర నాయకుడు ఎంత ఎగతాళిగా మాట్లాడాడో మనకు తెలుసు. నీరు వెనక్కి, ఎత్తుకు కూడా ఎక్కి మనం కోరుకున్న పల్లాలకు కూడా ప్రవహిస్తుందని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిరూపించారు కేసీఆర్.
పదవే ముఖ్యం కాదు. ఆ పదవి ఇచ్చే బలం, బాధ్యతతో ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి ఉపయోగపడే పనులు చేయడమూ ముఖ్యం. అభివృద్ధి-సంక్షేమం మధ్య సమతూకం పాటించే విషయంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ దేశంలోనే నంబర్ వన్గా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, రాజనీతి వ్యూహాలు మామూలే. ఎక్కడైనా ఉంటాయి. కానీ, ప్రజల సంక్షేమం-అభివృద్ధి వేరు. రాజకీయాల వల్ల అది ఆగిపోకూడదు. నిరంతరం కొనసాగుతూనే ఉండాలని ఆలోచించగలిగిన రాజకీయ నాయకులే నిజమైన నేతలు. వారు మాత్రమే ప్రజల కోసం, దేశం కోసం ఏమైనా చేయగలుగుతారు. ఎంత త్యాగానికైనా సిద్ధపడుతారు. అలాంటివారే చరిత్రలో నిలిచిపోతారు.
కేవలం 193 కిలోమీటర్ల సముద్రతీరం ఉన్న సింగపూర్ ‘ప్రపంచపు బిజీయెస్ట్ కార్గో’ను నడిపిస్తూ ధనిక దేశంగా వెలుగొందుతుంటే, 7,000 కిలోమీటర్ల సముద్రతీరం ఉన్న మన దేశం మాత్రం ఇంకా వెనక్కి వెళ్తోందంటే కారణం సుస్పష్టం. పాలకుల నిర్వాకమే. పాలనా వైఫల్యమే. దేశమంటే, దేశ ప్రజలంటే నిబద్ధత లేకపోవటమే.
జార్జ్ వాషింగ్టన్ (అమెరికా), డెంగ్ జియావొపింగ్ (చైనా), లీ క్వాన్ యూ (సింగపూర్) వంటి నాయకులు చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారంటే వారి కృషి అలాంటిది. ఇప్పుడు దేశంలో అలాంటి సామర్థ్యమున్న ఏకైక విలక్షణ నాయకుడు కేసీఆర్. ఆయనలాంటి ఉద్యమ శక్తి, నిరంతర అధ్యయనశీలి అయిన నాయకుడు పూనుకొని దేశం కోసం పని చేయాల్సి ఉన్నది. ఏదీ అంత సులభం కాదు. అలాగని అసాధ్యం కూడా కాదని.. ప్రపంచ చరిత్రలో, దేశ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో కూడా పలు సాక్ష్యాలున్నాయి.
(వ్యాసకర్త: రచయిత,సినీ దర్శకుడు)
మనోహర్ చిమ్మని
99895 78125